గట్టిగా పిండేసిన స్మిత్ సేన: చివరి 5 ఓవర్లలో: ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పెల్
షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఓ టీమ్ అత్యధిక పరుగుల లక్ష్యాన్ని కొట్టి అవతల పడేసిందటే.. అవతలి జట్టు బౌలర్ల పరిస్థితి ఎలా ఉంటుందో, ఎంత దయనీయమైన దుస్థితిని అనుభవించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. తమ స్పెల్ను కంప్లీట్ చేయడానికి కూడా గజగజ వణికి పోయి ఉంటారు. బాల్ అందుకోవడానికి భయపడిపోయి ఉంటారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని షార్జా వేదికగా ఆదివారం రాత్రి నాటి మ్యాచ్లో జరిగింది అదే. రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ల ధాటికి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బౌలర్లు ఠారెత్తిపోయారు. వారి దెబ్బకు బేజారెత్తిపోయారు.
ఉప్పల్ స్టేడియం గుర్తుకు: ఐపీఎల్లో రికార్డ్ ఛేజింగ్: ఆ 5 మ్యాచ్లు ఇవే: 2008 రికార్డు బ్రేక్
ఆకాశమే హద్దుగా..
223 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సిక్సర్ల జడివానను కురిపించారు. పిడుగుల్లాంటి షాట్లను విరుచుకుపడ్డారు. ఇన్నింగ్ ఆరంభం నుంచే ఈ దూకుడును కొనసాగించారు. జోస్ బట్లర్ రూపంలో తక్కువ పరుగులకే తొలి వికెట్ను కోల్పోయినప్పటికీ.. అదరలేదు.. బెదరనూ లేదు. పంజాబ్ బౌలర్ల దుమ్ము దులిపారు. టీమ్ మొత్తానికీ ఆడిందంతా నలుగురు బ్యాట్స్మెన్లే. స్టీవ్ స్మిత్, సంజు శాంసన్, తెవాతియా.. చివర్లో జోఫ్రా ఆర్చర్ పంజాబ్ బౌలర్లకు చుక్కులను చూపించారు.
చివరి అయిదు ఓవర్లలో..
రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ల ధాటికి అప్పటిదాకా ఉన్న రికార్డులన్నీ కొట్టుకుపోయాయి. సరికొత్త రికార్డులను పుట్టుకొచ్చాయి. చివరి అయిదు ఓవర్లలో అత్యధికంగా పరుగులను పిండుకున్న తాజా రికార్డును నెలకొల్పింది రాజస్థాన్ రాయల్స్... రాయల్గా. చివరి 30 బంతుల్లో ఏకంగా 86 పరుగులను రాబట్టింది. ఇందులో అత్యధికం సిక్సుల రూపంలో వచ్చినవే. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధికం. చివరి అయిదు ఓవర్లలో 86 పరుగులను సాధించిన జట్టు ఇప్పటిదాకా ఐపీఎల్లో మరొకటి లేదు. ఓవరాల్గా టీ20 చరిత్రలో రెండో మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పెల్ ఇది.
చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు బ్రేక్..
ఐపీఎల్ చరిత్రలో చివరి అయిదు ఓవర్లలో అత్యధిక పరుగులను రాబట్టుకున్న ఘనత ఇప్పటిదాకా చెన్నై సూపర్ కింగ్స్ మీద ఉండేది. ఇప్పుడది తెరమరుగైపోయింది. ఐపీఎల్ మ్యాచ్లో చివరి అయిదు ఓవర్లలో 77 పరుగులను సాధించింది చెన్నై సూపర్ కింగ్స్. ఇప్పటిదాకా అదే రికార్డు. 2012 ఐపీఎల్ సీజన్లో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చివరి అయిదు ఓవర్లలో 77 పరుగులను పిండుకుంది. ఇప్పుడు దాన్ని అధిగమించింది రాజస్థాన్ రాయల్స్ టీమ్. చివరి అయిదు ఓవర్లలో 86 పరుగులను రాబట్టుకుంది.
కరేబియన్ క్రికెటర్ల పేరు మీదే.. తొలి రికార్డు..
చివరి అయిదు ఓవర్లలో అత్యధిక పరుగులను రాబట్టుకోవడం ఐపీఎల్ చరిత్రలో ఇది తొలిసారి కాగా.. మొత్తం టీ20 చరిత్రలో రెండవది. కరేబియన్ ప్రీమియర్ లీగ్లో ట్రిన్బాగ్ నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్లు చివరి అయిదు ఓవర్లలో 90 పరుగులను చేశారు. ఓవరాల్గా అదే హయ్యెస్ట్. 2018 సీపీఎల్ టోర్నమెంట్లో భాగంగా గ్రాస్ ఐస్లెట్లో జరిగిన మ్యాచ్లో ట్రిన్బాగో టీమ్.. సెయింట్ లూసియా జట్టుపై ఈ రికార్డును నెలకొల్పింది. సెయింట్ లూసియా నిర్దేశించిన 212 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ట్రిన్బాగో బ్యాట్స్మెన్లు చివరి అయిదు ఓవర్లలో 90 పరుగులను సాధించారు. ఆ మ్యాచ్లో డారెన్ బ్రావో 36 బంతుల్లోనే 10 సిక్సులు, ఆరు ఫోర్లతో 94 పరుగులు చేశాడు. అయిదు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేశారు.