క్యాడర్ ఉంది సరే, మరి లీడర్లు.. ఆ కోటలో కమలం పువ్వు వికసించేనా..!
ఆదిలాబాద్ : క్యాడర్ పుష్కలంగా ఉంది.. మరి లీడర్ల సంగతేంటి? పార్టీ మీద అభిమానమో.. మోడీ మీద మమకారమో.. మొత్తానికి జిల్లాలో బీజేపీకి ఓ రేంజ్లో కార్యకర్తలైతే ఉన్నారు. మరి నాయకుల మాటేంటి? పార్టీ కోసం ప్రాణాలిచ్చే బంటులున్నారు.. మరి పార్టీని కాపాడే నేతలున్నారా? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు వివిధ కోణాల్లో సమాధానాలు దొరుకుతాయి. ఆదిలాబాద్ ఎంపీ స్థానం గెలిచినప్పటి నుంచి బీజేపీలో జోష్ కనిపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటున్న కాషాయం దండు ఆ మేరకు ప్రయత్నాలైతే చేస్తోంది. మరి భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలు వస్తాయనేది చర్చానీయాంశంగా మారింది.
లోక్సభ ఎన్నికల విజయంతో బీజేపీలో జోష్
తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికలు బీజేపీలో జోష్ నింపాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్ సెగ్మెంట్లలో తమ పార్టీ అభ్యర్థులు ఎంపీలుగా గెలుపొందేసరికి ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది. అయితే ఆదిలాబాద్ స్థానంపై ఆశలు లేకున్నా.. అనూహ్యంగా అక్కడ బీజేపీకి పట్టం కట్టడం ఢిల్లీ పెద్దలను ఆశ్చర్యానికి గురిచేసిందనే ప్రచారం జరిగింది. అదే క్రమంలో తెలంగాణలో బీజేపీకి బలం పెరిగిందని భావించారు. కానీ క్షేత్ర స్థాయిలో చూస్తే పార్టీకి క్యాడరుంది గానీ లీడర్లు సరిగా లేరనే టాక్ జోరందుకుంది.
బీజేపీకి బలం పెరిగిందా?
2014లో కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చింది మొదలు తెలంగాణలో బీజేపీకి అంతో ఇంతో బలం పెరిగిందని చెప్పొచ్చు. ఆ క్రమంలో రెండోసారి బంపర్ మెజార్టీతో అధికారంలోకి రావడం ఆ పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపింది. అయితే సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం కావడం.. పెద్ద సంఖ్యలో పార్టీ తీర్థం పుచ్చుకోవడం.. తదితర పరిణామాలు పార్టీకి కలిసొచ్చే అంశాలుగా చెబుతున్నారు రాష్ట్ర నేతలు. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి మరోలా కనిపిస్తోంది. బీజేపీకి క్యాడర్ ఫుల్లుగా ఉన్నా.. లీడర్లు మాత్రం సరిగా లేరనే వాదనలు వినిపిస్తున్నాయి.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్లో ముసలం...కమల్నాథ్ టార్గెట్గా సింధియా వ్యాఖ్యలు
జిల్లాలో పార్టీ బలోపేతానికి కసరత్తు
ఆదిలాబాద్ ఎంపీ స్థానం గెలిచిన దరిమిలా జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ నేతలు శ్రమిస్తున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని ఢీ కొట్టి విజయ బావుటా ఎగురవేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆ మేరకు బీజేపీ పెద్దలు కసరత్తు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. అదే క్రమంలో లోక్సభ సెగ్మెంట్ల వారీగా క్లస్టర్ ఇన్ఛార్జ్ లను ప్రకటించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎంపీ సోయం బాపురావును క్లస్టర్ ఇన్ఛార్జ్గా నియమించారు.
నేతల మధ్య అంతర్యుద్ధం?.. మున్సిపల్ ఎన్నికలపై కన్ను..!
మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్న బీజేపీ నేతలు ఆ మేరకు కసరత్తు చేస్తున్నారు. పార్టీ శ్రేణులు కూడా ఫుల్ జోష్తో కనిపిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా.. సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సై అంటున్నారు. అయితే లీడర్ల మధ్య ఇంటర్నల్ వార్ పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారినట్లు కనిపిస్తోంది.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి మధ్య అంతర్యుద్ధం సాగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఛైర్మన్ కుర్చీపై కన్నేసిన సుహాసిని రెడ్డి ఇదివరకే పార్టీ పెద్దలను కలిశారనే టాక్ నడుస్తోంది. రిజర్వేషన్ కలిసొస్తే కచ్చితంగా రంగంలోకి దిగేందుకు ఆమె సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే పాయల శంకర్తో ఆమెకు రాజకీయ విభేదాలు ఉండటంతో మున్ముందు వీరిద్దరు కలిసి ఎలా ముందుకు సాగుతారనేది పెద్ద ప్రశ్న.