లీడర్ల దౌర్జన్యం నశించాలి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోండి.. ఫారెస్ట్ ఉద్యోగుల ర్యాలీ (వీడియో)
కాగజ్ నగర్ : ప్రభుత్వ ఆదేశాలతో మొక్కలు నాటేందుకు సిద్ధమైన అటవీ అధికారులపై సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తమ్ముడు కోనేరు కృష్ణ దాడి చేయడం వివాదస్పదమైంది. మహిళా అటవీ అధికారిపై టీఆర్ఎస్ లీడర్ల జులుంపై సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదలావుంటే బాధ్యులైన ఎమ్మెల్యే సోదరుడు సహా 16 మందిపై కేసులు బుక్కయ్యాయి. మరోవైపు ఓ డిఎస్పీ, సీఐపై సస్పెన్షన్ వేటు పడింది.
తమ్ముడి కోసం అన్న పాకులాట.. గిట్లనే చెప్పాలే.. గ్రామస్తులకు ఎమ్మెల్యే కోనప్ప క్లాస్ (వీడియో)
మహిళా అటవీ అధికారులపై దౌర్జన్యం నశించాలంటూ ఆ శాఖ ఉద్యోగులు రోడ్డెక్కారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై చేయి చేసుకోవడం తగదంటూ ఆందోళనకు దిగారు. ఆ మేరకు కాగజ్ నగర్ టౌన్లో బ్యానర్లు చేతబట్టి శాంతి ర్యాలీ నిర్వహించారు. ఆదివారం నాడు సార్సలా ప్రాంతంలో మహిళా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రజా ప్రతినిధులు ఇలా తమపై దాడులు చేస్తే ఉద్యోగాలు ఎలా చేస్తామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్పై జరిగిన దాడిని పలువురు ఖండిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్ నేతలు రెచ్చిపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒక మహిళా ఆఫీసర్ అని చూడకుండా.. ఆమెపై కర్రలతో విచక్షణారహితంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది.
ఎఫ్ఆర్వో అనితపై దాడి చేసిన ఘటనలో సిర్పూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ సహా 16 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 147,148, 207,332,353,427 సెక్షన్ల కింద ఈజ్గామ్ పోలీసులు కేసు ఫైల్ చేశారు.