బతుకుతానని అనుకోలేదు, మహిళ FRO కన్నీళ్లు.. డీఎస్పీ, సీఐ ఔట్.. ప్రభుత్వంపై విపక్షాల దాడి
కాగజ్ నగర్ : అటవీ అధికారిణిపై టీఆర్ఎస్ లీడర్ల జులుంపై సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఘటన జరిగిన కొద్దిసేపటికే.. సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదలావుంటే బాధ్యులైన ఎమ్మెల్యే సోదరుడు సహా 16 మందిపై కేసులు బుక్కయ్యాయి. మరోవైపు ఓ డిఎస్పీ, సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. మహిళా అధికారిపై విచక్షణారహితంగా దాడి చేసిన టీఆర్ఎస్ నేతల తీరుపై విపక్ష నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
దెబ్బలు తాళలేక కన్నీరు.. బతుకుతానని అనుకోలేదు..!
సిర్పూర్ కాగజ్నగర్లో మహిళ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్పై జరిగిన దాడిని పలువురు ఖండిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్ నేతలు రెచ్చిపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒక మహిళా ఆఫీసర్ అని చూడకుండా.. ఆమెపై కర్రలతో విచక్షణారహితంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది.
ఎఫ్ఆర్వో అనితపై దాడి చేసిన ఘటనలో సిర్పూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ సహా 16 మందిపై పోలీసులు కేసు నమోదైంది. 147,148, 207,332,353,427 సెక్షన్ల కింద ఈజ్గామ్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. కర్రలతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ సదరు మహిళా అధికారిణి ఆ దెబ్బలు తట్టుకోలేక హృదయవిదారకంగా కన్నీరు పెట్టుకున్నారు. అసలు తనకు ఆ క్షణంలో బతుకుతాననే నమ్మకం లేకుండా పోయిందని వాపోయారు. కోనేరు కృష్ణ మొదటగా తనపై దాడి చేశారని.. ఆ తర్వాత మరో పదిమంది వరకు ఆయన అనుచరులు కర్రలతో కొట్టారని తెలిపారు.
సారు, కారు, పదహారు తుస్.. ఇక 138 మున్సిపాలిటీలపై కన్ను.. ఈసారైనా తారక మంత్రం పారేనా?
అసలేం జరిగింది..?
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా.. సిర్పూర్ కాగజ్నగర్ ఏరియాలో ప్రత్యామ్నాయ అటవీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ క్రమంలో సార్సాలా గ్రామంలో 20 హెక్టార్లలో చెట్లు నాటేందుకు అటవీ అధికారులు సిద్ధమయ్యారు. అయితే చెట్లు నాటేందుకు భూమి అనువుగా లేదని.. చదును చేయించేందుకు సిద్ధమయ్యారు అటవీ అధికారులు.
అందులోభాగంగా భూమిని చదును చేసేందుకు ట్రాక్టర్లు, సిబ్బందితో సహా ఆదివారం ఉదయం ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దాంతో జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్గా వ్యవహరిస్తున్న కోనేరు కృష్ణ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో విచక్షణ కోల్పోయి ఫారెస్ట్ అధికారులపై దాడి చేశారు. దాంతో మహిళా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనితకు తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసుల అదుపులో 30 మంది.. 16 మందిపై పలు కేసులు
మహిళా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్పై జరిగిన దాడిని వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో విఫలమయ్యారనే కారణంతో కాగజ్ నగర్ డీఎస్పీ సాంబయ్య, సీఐ వెంకటేశ్వర్లను సస్పెండ్ చేశారు. అదలావుంటే దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు జిల్లా ఎస్పీ మల్లారెడ్డి. మొత్తం 30 మందిని బాధ్యులను చేస్తూ అదుపులోకి తీసుకున్నామని, అందులో 16మందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
పదవికి కోనేరు రాజీనామా
జడ్పీ వైస్ ఛైర్మన్ కోనేరు వెర్షన్ మరోలా ఉంది. రైతులను నెల రోజులుగా అటవీ అధికారులు ఇబ్బందులకు గురిచేయడంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. ఫారెస్ట్ అధికారులకు, రైతులకు మధ్య గొడవ జరిగిందని.. ఆ క్రమంలో రైతులు ఫోన్ చేస్తే తాము అక్కడకు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. అంతేగానీ అధికారులపై తాము ఎలాంటి దాడులు చేయలేదని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే సదరు మహిళా అధికారిపై విచక్షణారహితంగా దాడి చేసిన వీడియో వైరల్ కావడం గమనార్హం.
టీఆర్ఎస్ నేతల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అటవీ అధికారులపై దాడి జరిగిన తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతల జులుం అంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. కోనేరు కృష్ణ జడ్పీ వైస్ చైర్మన్ పదవితో పాటు, జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు.
25 ఏళ్లుగా బీజేపీకి దిక్కు లేదు.. కాలం చెల్లిన నేతలకు కండువా.. మంత్రి తలసాని ఘాటు వ్యాఖ్యలు
ప్రభుత్వం సమాధానం చెప్పాలన్న జీవన్ రెడ్డి
మహిళా అటవీ అధికారిపై జరిగిన దాడిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సిర్పూరు ఎమ్మెల్యే తమ్ముడి తీరుపై మండిపడ్డారు. 2008-2009లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పోడుభూములపై గిరిజనులకు సర్వ అధికారాలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడేమో టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల నుంచి పోడుభూములను బలవంతంగా లాక్కొనే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆ క్రమంలో పోడుభూముల్లో చెట్లను నాటాలని ప్రభుత్వం ఆదేశించడం సరికాదన్నారు. కాగజ్ నగర్ ఘటనపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.