సదర్మాట్ కోసం భూములిస్తే బెదిరిస్తారా.. ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే ఏలేటి ఫైర్
సదర్మాట్ ప్రాజెక్టు కింద భూములను కోల్పోతున్న వారికి పరిహారం చెల్లించాల్సిందేనని అంటున్నారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. పరిహారం ఇవ్వాలని అడిగిన బాధితులను బెదిరించడం సరికాదని అన్నారు. మామడ మండలం పొనకల్ వద్ద కొనసాగుతున్న సదర్మాట్ ప్రాజెక్టు భూ నిర్వాసితుల దీక్షా శిబిరాన్ని ఆయన సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతులకు మద్దతు తెలిపారు.
భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండానే పనులు చేపట్టడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఘటనకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బాధ్యత వహించాలని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. రైతు నేతలను కలిసిన వారిలో డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
నిర్మల్ జిల్లా మామడ మండలంలో సదర్మాట్ బ్యారేజీని నిర్మిస్తున్నారు. గోదావరి నదిపై ప్రభుత్వం నిర్మాణం చేపట్టింది. ఇందుకోసం రైతుల వ్యవసాయ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. నాలుగేళ్లు గడిచినా నష్టపరిహారం ఇవ్వడం లేదు. జాప్యాన్ని నిరసిస్తూ రైతులు నాలుగు రోజులుగా ఆందోళన చేపడుతున్నారు.
బ్యారేజీ నిర్మాణం కోసం విలువైన భూములను త్యాగం చేసి ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడం లేదని అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. కొన్ని రోజుల క్రితం భూ నిర్వాసితులను ఉద్దేశించి మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు రైతులను కలిసి మద్దతు తెలుపుతున్నారు.