తెలంగాణలో మహారాష్ట్ర ఎస్సై రచ్చ.. గన్నుతో హల్చల్.. చివరకు..! (వీడియో)
Recommended Video
ఆసిఫాబాద్ : మహారాష్ట్ర ఎస్సై తెలంగాణలో హల్చల్ చేశాడు. తుపాకీ చేతబట్టి నానా హంగామా సృష్టించాడు. గన్ను చేతిలో ఉంది కదా అని రెచ్చిపోయాడు. ఆదిలాబాద్ జిల్లాలోని పశువుల సంతలో పోలీస్ మార్క్ చూపించాడు. చివరకు సీన్ రివర్స్ కావడంతో తెలంగాణ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. ఆయనతో పాటు కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. సదరు ఎస్సై గన్ పట్టుకుని హల్చల్ చేసిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
చంద్రపూర్ జిల్లా రాజురా పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్సై వినయ్ సింగ్ గొల్మాడ్.. అక్కడే కానిస్టేబుల్గా పనిచేస్తున్న మహేశ్ బొయిరెతో కలిసి బుధవారం నాడు కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చాడు. గణేశ్పూర్ పశువుల సంతలో సర్వీస్ రివాల్వర్తో రెచ్చిపోయాడు. అక్కడున్నవారిని బెదిరిస్తూ నానా హంగామా సృష్టించాడు.
తెలంగాణలో మహారాష్ట్ర పోలీసుల వీరంగం
కొమరం భీం జిల్లాలో బుధవారం నాడు మహారాష్ట్ర పోలీసులు వీరంగం సృష్టించారు. చంద్రపూర్ జిల్లాలోని రాజూరా పోలీస్స్టేషన్కు చెందిన ఎస్ఐ వినయ్ సింగ్ గొల్మాడ్, కానిస్టేబుల్ మహేశ్ బొయిరె వాంకిడి మండలంలోని గణేష్పూర్ పశుసంతకు వచ్చారు. అయితే సర్వీస్ రివాల్వర్తో స్థానికులను బెదిరిస్తూ భయందోళనకు గురిచేశాడు. మహారాష్ట్ర నుంచి పశువులను అక్రమంగా తీసుకొచ్చారని నానా హంగామా చేశాడు. అంతేకాదు అక్కడున్న పశువులను లారీలో ఎక్కించి తమతోపాటుగా రాజురా పోలీస్ స్టేషన్కు తరలించాలంటూ హెచ్చరించాడు. కొంతమంది యువకులు ఎదురు తిరిగినప్పటికీ వారి మీద చేయి చేసుకున్నాడు.
కశ్మీర్ చిచ్చు పాకిస్తాన్తోనే కాదు.. ఎంఐఎం, టీఆర్ఎస్ మధ్య కూడా లొల్లి పెట్టేనా?
తుపాకీతో బెదిరిస్తూ.. నానా హంగామా
పశువుల బేరం చేసే వ్యాపారులే టార్గెట్గా బెదిరింపులకు పాల్పడ్డాడు సదరు ఎస్సై. ఆ క్రమంలో అక్కడున్న స్థానికులతోనూ గొడవపడ్డాడు. అంతేకాదు గన్ చూపిస్తూ వారిని బెదిరించాడు. చెప్పినట్లు చేయకపోతే మీ అంతు చూస్తానంటూ హెచ్చరించాడు. చాలాసేపు సదరు మహారాష్ట్ర పోలీసులు న్యూసెన్స్ చేయడంతో చివరకు స్థానికులు లోకల్ పోలీసులకు ఫోన్ చేశారు. రంగంలోకి దిగిన వాంకిడి ఎస్సై చంద్రశేఖర్ వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఉన్నతాధికారులకు జరిగిన విషయం వివరించడంతో జిల్లా ఎస్పీ మల్లారెడ్డి మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకున్నారు.
లారీ డ్రైవర్పై దాడి.. 2వేలు మాయం
పశువుల సంతలో నానా హంగామా చేయడమే గాకుండా మహారాష్ట్రలోని రాజురా వైపు ఖాళీగా వెళుతున్న లారీని ఆపాడు. డ్రైవర్ను బెదిరించి సంతలోని పశువులను లారీలోకి ఎక్కించాలని బెదిరించాడు. అయితే సదరు లారీ డ్రైవర్ ఒప్పుకోకపోవడంతో అతడిపై చేయి చేసుకున్నాడు. అక్కడితో ఆగకుండా అతడి దగ్గరున్న రెండు వేల రూపాయలను సైతం లాగేసుకున్నాడు. సమాచారం అందుకున్న వాంకిడి పోలీసులు స్థానికుల సహకారంతో మహారాష్ట్ర పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
మానవ మృగానికి ఉరిశిక్ష సరైందే.. కోర్టు తీర్పుపై కేటీఆర్ హర్షం
తెలంగాణ పోలీసులతోనూ వాగ్వాదం.. మద్యం మత్తులో అలా..!
సర్వీస్ రివాల్వర్తో బీభత్సం సృష్టించిన సదరు మహారాష్ట్ర పోలీసులు.. అక్కడకు చేరుకున్న తెలంగాణ పోలీసులతోనూ అదేవిధంగా వ్యవహరించారు. వారిని కూడా నానా మాటలంటూ రెచ్చిపోయారు. చాలాసేపు పశువుల సంతలో హల్చల్ చేశారు. అయితే వారిద్దరు కూడా మద్యం మత్తులో ఉన్నట్లు వాంకిడి పోలీసులు గుర్తించారు. చంద్రపూర్ జిల్లా ఉన్నతాధికారులతో జిల్లా ఎస్పీ మల్లారెడ్డి ఫోన్లో మాట్లాడి జరిగిన విషయం వివరించారు. దాంతో అక్కడి నుంచి వచ్చిన ఓ సీఐ.. రచ్చ రచ్చ చేసిన మహారాష్ట్ర పోలీసులను వారించి ఆయనతో పాటు తీసుకెళ్లారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఇక్కడి పోలీసులకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి మహారాష్ట్ర బోర్డర్లోని కొమరం భీం జిల్లాలో అక్కడి పోలీసులు న్యూసెన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడం చర్చానీయాంశమైంది.