అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం: వరద బాధితులకు మంత్రి ఇంద్రకరణ్ భరోసా
తెలంగాణ రాష్ట్రంలో వర్ష ప్రభావం ఇంకా ఉంది. ఉదయం వేళ కాస్త వాన లేకున్నా.. ఆ తర్వాత మాత్రం కురుస్తూనే ఉంది. నిర్మల్ భారీ వర్షాల నేపథ్యంలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. జీఎన్ఆర్ కాలనీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. వరద పరిస్థితి, సహాయ చర్యలపై ఆరా తీశారు.
వరదలు, భారీ వర్షాల వల్ల కలిగిన నష్టం వివరాలను, సహాయక చర్యల గురించి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు తక్షణ సహాయం సహాయం అందించేందుకు దృష్టిసారించాలని అధికారులకు సూచించారు. నష్టం అంచనా వేసి పరిహారం అందేలా అధికారులు చూస్తారని తెలిపారు. ప్రకృతి విలయం కారణంగా ప్రజలతోపాటు రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
స్వర్ణ ప్రాజెక్ట్లో ఊహించని విధంగా వరద నీరు రావడంతో గేట్లు ఎత్తివేశారని, దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని తెలిపారు. ఇన్ ఫ్లో తగ్గడంతో గేట్లు మూసివేయడంతో వరద తగ్గుముఖం పట్టిందన్నారు. అధికారులు, సిబ్బంది నిన్నటి నుంచే సహాయక చర్యలు చేపట్టారని చెప్పారు.బాధితులకు అన్ని విధాలా అండగా ఉండి, సహాయం చేస్తామని వెల్లడించారు. మంత్రి వెంట ఐజీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ, ఎస్పీ ప్రవీణ్ కుమార్, మునిసిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ ఉన్నారు.
ఇటు సారంగాపూర్ మండలం గోపాలపేటలో వరద ఉదృతికి కూలీ పోయిన వంతెనను పరిశీలించారు. వంతెన కూలిపోవడంతో గోపాలపేట గ్రామానికి రాకపోకలు స్తంభించాయి. వరద తగ్గిన వెంటనే యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి రాకపోకలు పునరుద్ధరించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.