ప్రపంచంలో అతిపెద్ద 'గిరిజన' పండుగ.. ''నాగోబా'' జాతరకు సర్వం సిద్ధం
ఆదిలాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగకు ఆదిలాబాద్ జిల్లా వేదిక కానుంది. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో.. సర్పజాతిని పూజించే 'నాగోబా' జాతర మొదలుకానుంది. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని సోమవారం (04.02.2019) నాడు అర్ధరాత్రి మహాపూజ నిర్వహించనున్నారు ఆదీవాసీలు. తమ ఆరాధ్యదైవమైన నాగోబా (శేషనారాయణ మూర్తి) పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనుల ప్రగాఢ విశ్వాసం.
ఆదివాసీల సంప్రదాయాలకు పెద్దపీట వేసే నాగోబా జాతరకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తారు. దేశం నలుమూలల నుంచి గిరిజనులు ఈ జాతరకు రావడం ఆనవాయితీ. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర.. మెస్రం వంశీయుల మహాపూజలతో ప్రారంభమై ఈనెల 10 వరకు అధికారికంగా జరగనుంది. ఆ తర్వాత కూడ మరో 5 రోజుల పాటు అనధికారికంగా జాతర కొనసాగుతుంది.
గిరిపుత్రుల మహా పండుగ
సోమవారం అర్ధరాత్రి మెస్రం వంశీయులు మహాపూజ నిర్వహించిన తర్వాత జాతర ప్రారంభమైనట్లు లెక్క. మహాపూజ జరిగిన తర్వాతే ఎవరైనా ఆలయంలోకి ప్రవేశించి పూజలు చేయవచ్చు. అంతవరకు లోనికి వచ్చే అవకాశముండదు. మహాపూజ అనంతరం మెస్రం వంశీయులు భేటింగ్ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇది తెల్లవారుజాము వరకు కొనసాగుతుంది. మెస్రం వంశంలోకి వచ్చిన కొత్త కోడళ్లకు నాగోబా దర్శనం చేయించి.. వంశ పెద్దలను పరిచయం చేయిస్తారు. అనంతరం వారిచే ఆశీర్వచనాలు ఇప్పిస్తారు. అలా ఈ భేటింగ్ కార్యక్రమంతో, కొత్త కోడళ్లు మెస్రం వంశంలోకి వచ్చినట్లు భావిస్తారు.
ఆదిశేషువు వస్తాడని నమ్మకం
ఆదిలాబాద్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నాగోబా ఆలయం. ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ సమీపంలోని కేస్లాపూర్ గ్రామంలో ఈ ఆలయం ఉంది. అమావాస్య నాడు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్య గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడనేది ఓ నమ్మకం. వీరు పూజలు చేసి నైవేద్యంగా పెట్టిన పాలు తాగి ఆశీర్వచనాలు అందించి అదృశ్యమవుతాడని బలంగా నమ్ముతారు.
నాగోబా జాతరతో కేస్లాపూర్ గ్రామం జనసంద్రంగా మారుతుంది. వాస్తవానికి 5 వందల లోపు మాత్రమే జనాభా ఉండే గ్రామంలో నాగోబా జాతరతో కళకళలాడుతుంటుంది. పెద్దసంఖ్యలో తరలివచ్చే ఆదీవాసీలతో కేస్లాపూర్ సరికొత్త శోభ సంతరించుకుంటుంది. నాగోబాను కొలిస్తే కొంగుబంగారంగా నిలుస్తాడని, పంటలు బాగా పండుతాయని, రోగాలు దరిచేరవని గిరిపుత్రుల ప్రగాఢ విశ్వాసం.
22 పొయ్యిలు.. అక్కడే వంట
నాగోబా జాతరకు ఎంతమంది మేస్రం వంశీయులు వచ్చినా.. పెట్టేది మాత్రం 22 పొయ్యిలే. ఎవరికివారు ఇష్టమొచ్చినట్లు పొయ్యిలు పెట్టుకుని వంట చేసుకోవడానికి వీల్లేదు. అది కూడా ఎక్కడ పడితే అక్కడ పొయ్యిలు పెట్టరాదు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ప్రహరీ గోడ లోపల మాత్రమే పొయ్యిలు పెడతారు. ఆ గోడకు చుట్టూరా దీపాలు వెలిగించేందుకు చిన్న అరలు ఉంటాయి. అందులో పెట్టే దీపాల కాంతుల వెలుగులోనే వంటలు చేసుకోవాలి. ఆ ప్రాంతంలో మాత్రమే 22 పొయ్యిలు పెడతారు. మేస్రం వంశీయులు వేలాదిగా తరలివచ్చినా సరే.. ఆ 22 పొయ్యిల మీదే వంతుల వారీగా వంటలు చేసుకోవాల్సి ఉంటుంది. మిగతావారు ఎక్కడ వంట చేసుకున్నా ఫర్వాలేదు.