అడవితల్లి ఒడిలో "నాగోబా" సంబురం.. పులకించిపోతున్న "గిరిజనం"
ఆదిలాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజనుల పండుగ ప్రారంభమైంది. ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబాను కొలుస్తూ జరుపుకొనే జాతరకు అంకురార్పణ జరిగింది. మెస్రం వంశీయుల మహాపూజలతో జాతర షురువైంది. దేశం నలుమూలల నుంచి తరలివస్తున్న గిరిపుత్రులతో కేస్లాపూర్ గ్రామం కొత్త శోభ సంతరించుకుంది. అడవి తల్లి ఒడిలో జరిగే ఈ జాతర చూడటానికి రెండు కళ్లు సరిపోవంటే అతిశయోక్తి కాదు.
అడవి తల్లి పండుగ
ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జనసంద్రంగా మారింది. నాగోబా జాతర పురస్కరించుకుని గిరిపుత్రులు కేస్లాపూర్ కు క్యూ కడుతున్నారు. పుష్యమాస్య అమావాస్య సందర్భంగా సోమవారం (04.02.2019) అర్ధరాత్రి నాగోబా మూలవిరాట్టుకు మహాపూజలు నిర్వహించారు మేస్రం వంశీయులు. గిరిపుత్రులు ప్రత్యేకంగా తీసుకొచ్చిన గంగాజలంతో నాగోబా మూలవిరాట్టును అభిషేకించారు. అలా ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర వేడుకలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి మెస్రం వంశీయులు భారీగా తరలివచ్చారు. ఇంటి ఇలవేల్పును కొలుస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
జాతర షురూ.. వారం రోజులు పండుగే
కేస్లాపూర్ లో జరిగే నాగోబా జాతర చూడటానికి రెండు కళ్లు సరిపోవు. గిరిజన సంప్రదాయంలో జరిగే ఈ ఉత్సవాలు.. అడవి తల్లి చల్లనిచూపును ప్రతిబింబిస్తాయి. సోమవారం అర్ధరాత్రి మెస్రం వంశీయుల ప్రత్యేక పూజలతో జాతరకు అంకురార్పణ జరుగుతుంది. వారం రోజుల పాటు జరిగే జాతరలో గిరిపుత్రులు భక్తి పారవశ్యంలో మునిగితేలుతారు. ఆదివాసీల సనాతన ఆచారం ప్రకారం.. జిల్లాలోని సిరికొండ గ్రామంలో తయారయ్యే కొత్త కుండలను తీసుకువస్తారు. గోవాడగా పేరున్న కోనేరు నుంచి మెస్రం ఆడపడుచులు.. ఆ కొత్త కుండల్లో పవిత్ర జలాలు తీసుకువచ్చారు. మెస్రం వంశానికి చెందిన అల్లుళ్లు మట్టితో పుట్టలు చేసి నియమ నిష్టలతో ప్రత్యేక పూజలు చేశారు. నాగోబాను కొలిస్తే అనారోగ్య సమస్యలు దరిచేరవని, సుఖశాంతులతో మెరుగైన జీవితం లభిస్తుందని గట్టిగా నమ్ముతారు.
7న గిరి దర్బార్
పుష్యమాస్య అమావాస్య నాడు నాగోబాకు మహా పూజలు నిర్వహించడంతో జాతర ప్రారంభమైంది. విద్యుత్ దీపాల కాంతుల్లో నాగోబా దేవాలయం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మెస్రం వంశీయుల ప్రత్యేక పూజల అనంతరం.. జిల్లా అధికారులు నాగోబాకు సంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించారు. నాగోబా జాతరను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈనెల 7న అధికారికంగా గిరి దర్బార్ ఏర్పాటు చేయనున్నారు అధికారులు. నాగోబా జాతరకు అందరూ రావాలనే ఉద్దేశంతో.. ఆ రోజు జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తారు. గిరి దర్బార్ లో ఆదివాసీల నుంచి ఆర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. 10వ తేదీన నాగోబా జాతర అధికారిక వేడుకలు ముగుస్తాయి.