ప్లెక్సీ రగడ.. కనిపించని మోడీ, బీజేపీ శ్రేణుల ఆగ్రహాం, కేసీఆర్ ఫోటో చించివేత
చిన్న కార్యక్రమాలు అయినా.. ప్రభుత్వ వేదికలపై ప్రోటోకాల్ కంపల్సరీ. పెద్దల ఫోటోలు, ప్రసంగం కూడా అలానే సాగుతోంది. అయితే కొన్ని సందర్భాల్లో మరవడంతో రచ్చ రచ్చ జరుగుతోంది. వాస్తవానికి పలు సందర్భాల్లో ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో కూడా జరిగింది. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో రగడ నెలకొంది. ప్రధాని మోడీ ఫోటో లేదని బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు.
Recommended Video
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య వాగ్వివాదం జరిగింది. కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేదు. దీంతో బీజేపీ జడ్పీటీసీ సభ్యుడు పతంగే బ్రహ్మనంద్, పీఏసీఎస్ చైర్మన్ ముండే సంజీవ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగితే బాగుండేది కానీ వారు కేసీఆర్ చిత్రపటంతో ఉన్న ఫ్లెక్సీని చింపేశారు.
దీంతో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఎంపీపీ రాథోడ్ పుండలిక్, బీజేపీ జడ్పీటీసీ పతంగే బ్రహ్మనంద్ మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని సముదాయించారు. దీంతో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం సాఫీగా కొనసాగింది. లేదంటే నేతల ఆందోళనతో అర్ధాంతరంగా ముగించేయాల్సి వచ్చేది. ఇరువర్గాలు శాంతించడంతో టీకాల కార్యక్రమం కొనసాగింది.