సర్పంచ్ కుమారుడి జులుం: గ్రామంలోకి రావాలంటే అనుమతి తీసుకోవాలట,
అధికార పార్టీ బలమో, పదవీ ఉందనే అండో తెలియడం లేదు. కొన్నిచోట్ల సర్పంచ్/ వారి బంధువులు అజమాయిషీ చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో ఓ సర్పంచ్ కుమారుడు జులుం ప్రదర్శించారు. విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి మరీ చుక్కలు చూపించారు. తన అనుమతి లేకుండా గ్రామంలోకి రావొద్దని స్పష్టంచేశారు. సర్పంచ్ కుమారుడి అధికార దర్పం.. సర్వత్రా చర్చానీయాంశం అయ్యింది.
గ్రామంలోకి వస్తే అగ్గి పెట్టేస్తానంటూ విద్యుత్ అధికారులకు టీఆర్ఎస్ సర్పంచ్ కుమారుడు వార్నింగ్ ఇచ్చాడు. బిల్లులు చెల్లించకపోవడంతో తానూర్ మండలం, మహాలింగి గ్రామానికి అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో సర్పంచ్ రత్నబాయి కుమారుడు పోశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశాడు. లైన్మెన్కు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఏఈ, డీఈలకు అగ్గిపెట్టేస్తానని ఫోన్లోనే హెచ్చరించాడు. తన అనుమతి లేకుండా గ్రామంలోకి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చాడు.
సర్పంచ్ కుమారుడి ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదేం తీరు అని మండిపడుతున్నారు. అధికారం ఉందనే అహంకారంతో ప్రవర్తించడం సరికాదని అంటున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేదంటే మరొకరు ఇలానే వ్యవహరించే అవకాశం ఉందని చెబుతున్నారు.