కొడుకే కాడెద్దు-ఆదిలాబాద్ రైతుకు అనుకోని కష్టం-ఆదుకోవాలని అధికారులకు విజ్ఞప్తి
తొలకరి వానతో రైతులు వానా కాలం పనుల్లో నిమగ్నమయ్యారు. చేలల్లో విత్తనాలు చల్లేందుకు దుక్కులు దున్నుతున్నారు. ఆలస్యమైతే మట్టిలో తేమ ఆవిరయ్యే అవకాశం ఉండటంతో వ్యవసాయ పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు కూడా అందరి లాగే వ్యవసాయ పనులు మొదలుపెట్టాడు. తనకున్న ఆరెకరాల చేనులో పత్తిని సాగు చేయాలనుకున్నాడు. ఇందుకోసం దుక్కులు దున్నడం ప్రారంభించగా... కాడెద్దుల్లో ఓ ఎద్దు చనిపోయింది. మరో ఎద్దును కొనేందుకు డబ్బులు లేకపోవడంతో ఆ రైతు కొడుకే కాడెద్దులా మారాల్సిన పరిస్థితి తలెత్తింది. గతేడాది చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన నాగేశ్వరరావు అనే రైతు తన కూతుళ్లనే కాడెద్దులుగా మలచిన వైనం అందరికీ గుర్తుండే ఉంటుంది. అదే పరిస్థితి ఇప్పుడీ ఆదిలాబాద్ రైతుకూ వచ్చింది.
సాహో సోనూ సూద్.. చిత్తూరు పేదకు భారీ సాయం.. 'కాడెద్దులుగా కూతుళ్లు’ వీడియో వైరల్ కావడంతో..
కుమారుడే కాడెద్దు...
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం డోంగార్గావ్కి చెందిన కోవ అభిమాన్ అనే రైతుకు ఆరెకరాల వ్యవసాయ భూమి ఉంది. వానా కాలం మొదలవడంతో పత్తి విత్తనాలు నాటేందుకు దుక్కులు దున్నడం ప్రారంభించాడు. కొంత భూమిని చదును చేశాక కాడెద్దుల్లో ఓ ఎద్దు చనిపోయింది. మరో ఎద్దును కొనాలంటే రూ.40వేలు కావాలి. అంత డబ్బు తన వద్ద లేదు. పోనీ... గ్రామంలో మరెవరినైనా అడుగుదామా అంటే... అందరూ దుక్కులు దున్నడంలోనే బిజీగా ఉన్నారు. దీంతో చేసేది లేక 18 ఏళ్ల తన కుమారుడు కోవ అవినాష్నే కాడెద్దుగా మలిచాడు.
తప్పనిసరి పరిస్థితుల్లో...
సాధారణంగా నాగలికి రెండు ఎద్దులు ఉంటేనే బ్యాలెన్స్ సరిగా ఉంటుంది.నేలను దున్నడానికి సాధ్యపడుతుంది. ఒక ఎద్దుతో దుక్కి దున్నడం అసాధ్యం. దీంతో కోవ అభిమాన్... ఉన్న ఒక్క ఎద్దుకు జతగా తన కుమారుడు అవినాష్ను కాడెద్దుగా మలిచాడు. దుక్కులు దున్నడం ఆలస్యమైతే మట్టిలో తేమ ఆవిరైపోయి విత్తనాలు మొలకెత్తవని చెబుతున్నాడు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో తన కొడుకునే కాడెద్దుగా మార్చాల్సి వచ్చిందని వాపోయాడు. తన పరిస్థితిని అర్థం చేసుకుని ఉట్నూరులోని గిరిజన అభివృద్ది ఏజెన్సీ సాయం చేయాలని అభ్యర్థిస్తున్నాడు.
Recommended Video
గతేడాది చిత్తూరులోనూ... సోనూ సూద్ సాయం
గతేడాది చిత్తూరు జిల్లా మదనపల్లెలోనూ ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. నాగేశ్వరరావు అనే రైతుకు ఎద్దులు లేకపోవడంతో తన ఇద్దరు బిడ్డలనే కాడెద్దులుగా మలచి దుక్కులు దున్నాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారి నటుడు సోనూ సూద్ దృష్టికి వెళ్లాయి. స్పందించిన సోనూ సూద్... వెంటనే ఆ కుటుంబానికి ఓ ట్రాక్టర్ కొనిచ్చాడు. దీంతో ఆ కుటుంబానికి కష్టాలు తప్పాయి. సోనూ సూద్ చేసిన సాయం ఎప్పటికీ మరిచిపోలేమని ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలియజేసింది. ఆదిలాబాద్కు చెందిన కోవ అభిమాన్కు కూడా ఎవరైనా ఇలా ముందుకొచ్చి సాయం చేస్తే... అతనికీ కష్టాలు తప్పుతాయి. సేద్యం చేసే రైతన్నకు సాయం అందిస్తే... నాలుగు మెతుకులు పండించి సమాజానికి పట్టెడన్నం పెట్టగలుగుతాడు.