రేషన్ బియ్యంలో యూరియా: వినియోగదారుల ఆందోళన, తనకేమీ తెలియదంటోన్న డీలర్
రేషన్ బియ్యం.. పేదల ఆకలి తీర్చే సంజీవని. ఇక కరోనా సమయంలో కేంద్రం/ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉచితంగానే బియ్యం అందిస్తున్నాయి. నెల నెల 1వ తేదీ రాగానే బియ్యం కోసం పేదలు ఎదురుచూస్తుంటారు. అయితే రేషన్ బియ్యం కొన్ని చోట్ల సన్న బియ్యం కూడా వస్తున్నాయి. దీంతో తీసుకొనేందుకు జనం ఎగబడుతున్నారు. అయితే ఆదిలాబాద్ జిల్లాలో అయితే రేషన్ బియ్యంలో యూరియా కనిపించింది. దీంతో లబ్దిదారులు నోరెళ్లబెట్టారు.
రేషన్ బియ్యంలో యూరియా కలిసి రావడంతో వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మర్కగూడ గ్రామంలో రేషన్ షాపులో యూరియా వచ్చింది. మర్కగూడలో కొలాన్ గిరిజనులకు 3 వందల క్వింటాళ్లను పంపిణీ చేశారు. అయితే వంట చేసుకునేందుకు మహిళలు బియ్యం కడుగుతుండగా అందులో యూరియా గులికలు కనిపించాయి. స్థానికులు రేషన్ దుకాణానికి చేరుకుని డీలర్ను నిలదీశారు. తనకేమీ తెలియదని.. వచ్చిన బియ్యాన్ని పంపిణీ చేస్తున్నానని ఆయన చెప్పారు.
Recommended Video
రేషన్ బియ్యంలో యూరియా రావడంతో తర్వాత పంపిణినీ నిలిపివేశారు. అప్పటికే బియ్యం తీసుకువెళ్లిన వారు వంట చేసుకోవద్దని సమాచారం ఇచ్చారు. తర్వాత స్థానిక రెవెన్యూ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. రేషన్ షాపునకు వచ్చి అధికారులు బియ్యాన్ని పరిశీలించారు. యూరియా ఆనవాళ్లు ఉన్నాయని ప్రాథమికంగా నిర్ధారించారు. బియ్యంలో యూరియా ఎలా కలిసిందో తెలియరాలేదు. కానీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బియ్యాన్ని పరిశీలించకుండా వండితే తమ పరిస్థితి ఏంటీ అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.