5 రోజుల ముందే దసరా పండుగ.. అడవి తల్లి ఒడిలో ప్రత్యేక పూజలు
ఆదిలాబాద్ : దసరా పండుగ అడవి తల్లి ఒడిలో ఐదు రోజుల ముందే ప్రారంభమైంది. గిరిపుత్రుల ప్రత్యేక పూజలతో కొండ కోన పరవశించి పోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్న ఈ సంప్రదాయం తరతరాలుగా వస్తోంది. ఈసారి మంగళవారం (08.10.2019) నాడు దసరా పండుగ వస్తున్న నేపథ్యంలో.. ఐదు రోజుల ముందు అంటే శుక్రవారం నాడే అక్కడ వేడుకలు మొదలయ్యాయి.
అడవి తల్లి ఒడిలో దసరా సంబురాలు.. ఐదు రోజుల ముందుగానే..!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన మహరాజ్ గూడ అడవుల్లో దసరా పండుగ సంబురాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ కొలువుదీరిన జంగుబాయి అమ్మవారి సన్నిధిలో ఆదీవాసీలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశమంతటా ఈ నెల 8వ తేదీ పండుగ జరుపుకుంటుంటే ఈ ప్రాంతంలో మాత్రం శుక్రవారం నాడే దసరా సందడి మొదలైంది. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం.
జంగుబాయి సన్నిధిలో విజయదశమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దసరా పండుగ సంబురాల కోసం ఆలయ కమిటీ అన్నీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఆదీవాసీలు ఇక్కడకు రావడం, ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో గిరిపుత్రులు ఆలయ సన్నిధికి చేరుకున్నారు.
ఆ పోస్టు కోసం ఎంత తెగింపు.. మంత్రి కేటీఆర్ సంతకం ఫోర్జరీ..!
జంగుబాయి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు
దసరా పండుగకు ఐదు రోజుల ముందే ఇక్కడ వేడుకలు, ప్రత్యేక పూజలు నిర్వహించడం ఏళ్లుగా వస్తున్న ఆచారం. ప్రతి యేటా దసరా పండుగకు ముందు ఇక్కడి అమ్మవారి సన్నిధిలో ఐదు రోజుల ముందే విజయదశమి వేడుకలు నిర్వహించడం జరుగుతోంది. ప్రకృతి ఒడిలో.. అడవి తల్లి నీడలో భక్తిప్రపత్తులతో సాగే దసరా సంబురాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆద్యంతం భక్తి భావం ఉప్పొంగి పోతుంది. శుక్రవారం (04.10.2019) నాడు దసరా వేడుకలు ప్రారంభమైన నేపథ్యంలో గురువారం (03.10.2019) రాత్రి పోచమ్మ తల్లికి, ఇతర దేవతలకు పూజలు నిర్వహించి కోరిన కోర్కెలు నెరవేరాలని మొక్కుకుంటారు.
రెండు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసీలు
శుక్రవారం నాడు దసరా ఉత్సవాలు ప్రారంభం కానుండటంతో ఆదివాసీలు తరలి వస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన గిరిపుత్రులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వచ్చి జంగుబాయి అమ్మవారిని కొలుస్తుంటారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. ఆ క్రమంలో తొలుత టొప్లకస నుంచి గంగా జలం తీసుకొచ్చి దేవతా విగ్రహాలను శుద్ధి చేస్తారు. అనంతరం శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేస్తుంటారు.
మురికి నీరు రోడ్డు పైకి.. మున్సిపల్ అధికారుల భారీ జరిమానా..!
రెండు నెలల తర్వాత జంగుబాయి అమ్మవారి ఉత్సవాలు
ఈ ఏడు తాము పండించిన ఆహారధాన్యాలను పోచమ్మ తల్లి విగ్రహం ఎదుట ఉంచడం ఈ వేడుకల్లో ప్రత్యేకత. అంతేగాకుండా ఇక్కడున్న రావుడ్ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మైసమ్మ, జంగుబాయి అమ్మవార్లు కొలువుదీరిన ప్రాంతాల్లో ప్రార్థనలు చేస్తారు. ఆదీవాసీల్లో ప్రముఖంగా వ్యవహరిస్తున్న ఎనిమిది వంశాలకు సంబంధించిన పెద్దలు (కటోడాలు) ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తారు. దసరా వేడుకల సందర్భంగా అందరూ ఒక్క చోట చేరుతారు కాబట్టి రెండు నెలల తర్వాత ఇక్కడ నిర్వహించనున్న జంగుబాయి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు.