ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం... తెలంగాణలో వెలుగుచూసిన దారుణం...
దేశంలో నిత్యం మహిళలపై అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఎంత నిరసన వ్యక్తమవుతున్నా.. నిందితులకు ఎంత కఠిన శిక్షలు విధిస్తున్నా కామాంధుల్లో మార్పు రావట్లేదు. ఓవైపు ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ ఘటనపై దేశమంతా గొంతు చించుకుని నినదిస్తుంటే... మరోవైపు మహిళలపై ఆకృత్యాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణలోనూ ఓ ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచార ఘటన వెలుగుచూసింది.
అసలేం జరిగింది...
పోలీసుల కథనం ప్రకారం... ఆదిలాబాద్లో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఇటీవల హైదరాబాద్ ట్రాన్స్ఫర్ కోసం ఓ తెలిసిన వ్యక్తిని సంప్రదించింది. ఆమె భర్త,పిల్లలు హైదరాబాద్లో ఉండటంతో తాను కూడా అక్కడికే బదిలీ చేయించుకోవాలనుకుంది. ఈ క్రమంలో బంధువుల ద్వారా మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గాలిపెల్లి చంద్రశేఖర్ పరిచయమయ్యాడు. తనకు రాజకీయ నాయకులు,ఉన్నత స్థాయి అధికారులు తెలుసునని.. హైదరాబాద్ బదిలీ చేయిస్తానని నమ్మించాడు.
అత్యాచారం,బ్లాక్మెయిల్...
బదిలీకి కొంత ఖర్చవుతుందని ఆమె నుంచి చంద్రశేఖర్ కొంత డబ్బు కూడా తీసుకున్నాడు. అనంతరం బాధితురాలిని వెంటపెట్టుకుని అధికారులను కలవాలని చెప్పి హైదరాబాద్ వచ్చాడు. ఇదే అదనుగా నగరంలోని తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత నుంచి నీ ఫోటోలు,వీడియోలు ఉన్నాయని చెప్పి ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూ వస్తున్నాడు. అలా ఆమె నుంచి రూ.10లక్షలు నగదు,35 తులాల బంగారం కాజేశాడు.
ఇలా వెలుగులోకి...
ఎంత డబ్బులు ఇచ్చినా అతని వేధింపులకు తెరపడకపోవడంతో బాధితురాలు తీవ్ర మనస్తాపానికి గురైంది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తనలో తానే కుమిలిపోయింది. చివరకు ధైర్యం చేసి ఈ నెల 3న ఆదిలాబాద్ పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి న్యాయం చేయాలని కోరింది. ఉద్యోగ బదిలీ చేయిస్తానని చెప్పి తన పట్ల అఘాయిత్యానికి పాల్పడ్డ చంద్రశేఖర్పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు చంద్రశేఖర్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.