జగన్ సీఎం కావాలని పది సంవత్సరాలుగా.. తెలంగాణలో వీరాభిమాని ఏం చేశాడంటే..!
Recommended Video
ఆదిలాబాద్ : రాజకీయ నేతలకు ఫ్యాన్ ఫాలోయింగ్ కామన్ థింగ్. కొందరేమో వీరాభిమానులుగా మారుతుంటారు. ఇక ప్రాంతాలకతీతంగా నేతలను అభిమానించేవారు చాలా తక్కువని చెప్పొచ్చు. అదే కోవలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి తెలంగాణలో వీరాభిమాని ఉన్నారు.
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బెజ్జంకి అనిల్ కుమార్ వైఎస్ కుటుంబమంటే ఆరాధిస్తారు. అమితంగా ప్రేమిస్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర్నుంచి ఇప్పటివరకు ఆ కుటుంబానికి వీరాభిమానిగా ఉంటున్నారు. అయితే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలనేది ఆయన సంకల్పం. దానికోసం పదేళ్లుగా ఎదురుచూశారు.
జగన్ కోసం వినూత్న పంథా.. పదేళ్లుగా పాదరక్షలు లేకుండా..!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరాభిమానిగా మారిన బెజ్జంకి అనిల్ కుమార్.. ఆ కుటుంబానికి వీరవిధేయుడిగా ఉంటున్నారు. అయితే రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్ మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలనేది ఆయన ఆకాంక్ష. ఆ మేరకు పదేళ్లుగా ఆయన పాదరక్షలు ధరించడం లేదు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే పాదరక్షలు ధరిస్తానని వినూత్న పంథా ఎంచుకున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన వేళ ఆయన తనయుడిగా జగన్ సీఎం అవుతారని భావించారు అనిల్ కుమార్. కానీ ఆ కల నెరవెరలేదు. దాంతో అనిల్ ఆమరణ దీక్షకు దిగారు. ఆదిలాబాద్ నుంచి బాసర పుణ్యక్షేత్రం దాకా దాదాపు 160 కిలోమీటర్ల మేర పాదయాత్ర కూడా చేశారు. ఆ సందర్భంలోనే 2009, సెప్టెంబర్ నెలలో జగన్ సీఎం అయ్యేంతవరకు పాదరక్షలు ధరించబోనని ప్రతీన బూనారు.
అనిల్ నేపథ్యం.. రాజకీయ జీవితం
బెజ్జంకి అనిల్ కుమార్ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐలో పనిచేశారు. 1991లో క్రీయాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. 1992లో ఆదిలాబాద్ కాంగ్రెస్ పట్టణ కోశాధికారిగా పనిచేశారు. ఆ తర్వాత పట్టణ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీకి సేవలందించారు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లా కన్వీనర్గా కూడా పనిచేశారు.
2006లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు అనిల్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జరిగిన పరిణామాలతో వైసీపీలో చేరారు. ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి జిల్లాకు వచ్చినప్పుడు ఆయన వెన్నంటే కనిపించేవారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత గౌరవ అధ్యక్షురాలి హోదాలో ఆయన సతీమణి విజయమ్మ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఆమె వెంటే ఉన్నారు.
పదేళ్ల కల సాకారం.. అనిల్ కళ్లల్లో ఆనందం
ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ అక్కడి ప్రాంతంలో వైసీపీ తరపున విస్తృత ప్రచారం నిర్వహించారు అనిల్. ఎన్నికలు ముగిశాక వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని చెబుతూ వచ్చారు. ఆయన ఆకాంక్ష మేరకు వైసీపీ బంపర్ మెజార్టీ సాధించడం.. జగన్ ముఖ్యమంత్రి కావడం జరిగాయి.
వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిగా చూడాలనే బలమైన సంక్పలంతో పదేళ్లుగా పాదరక్షలు ధరించలేని అనిల్ కుమార్ కళ్లల్లో ఇప్పుడు ఆనందం కనిపిస్తోంది. పదేళ్లుగా తాను ఎదురుచూస్తున్న ఘడియ వచ్చిందని సంతోషపడుతున్నారు. మొత్తానికి తన కల నెరవేరినందుకు.. గురువారం నాడు వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తిరిగి పాదరక్షలు ధరించేందుకు సిద్ధమయ్యారు అనిల్.