ఆళ్లగడ్డలో అఖిలప్రియకు కీలక నేత షాక్, ఎవ్వర్నీ వదిలిపెట్టనని వైసీపీకి తీవ్ర హెచ్చరిక
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ మంత్రి భూమా అఖిలప్రియ షాకింగ్ కామెంట్స్ చేశారు. కర్నూలు జిల్లాలోని తన నియోజకవర్గం ఆళ్ళగడ్డలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. తనను ఓడించేందుకు ప్రత్యర్థులు అందరూ ఏకమవుతున్నారని వ్యాఖ్యానించారు.
నన్ను ఓడించేందుకు కష్టపడండి, లేదంటే ఎవ్వరినీ వదిలిపెట్టను
వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమి కోసం వ్యతిరేక శక్తులు ఒక్కటవుతున్నాయని, అందరూ తనను ఓడించేందుకు బాగా కష్టపడాలని ప్రత్యర్థులకు సూచించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలిస్తే మాత్రం ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. తన జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పారు. ఎన్నికల్లో గెలుపుపై తనకు ఎలాంటి భయం లేదని చెప్పారు. భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని చెప్పారు.
ఎవ్వర్నీ వదిలి పెట్టను, ఏం చేస్తానంటే
తనను ఓడించడం సాధ్యమయ్యే పని కాదని అఖిలప్రియ తన ప్రత్యర్థులకు చెప్పారు. తాను తిరిగి గెలిస్తే తనను ఇబ్బంది పెట్టిన వారిని ఎవరినీ వదిలి పెట్టేది లేదన్నారు. అలా అని తప్పుడు కేసులు పెట్టడం, దాడులు చేయించడం మాత్రం చేయనని స్పష్టం చేశారు. ప్రత్యర్థులను ప్రజలు మరిచిపోయేలా చేస్తానని అన్నారు. ప్రజలు మీ పేర్లు, మీ ముఖాలు గుర్తు పట్టని విధంగా చేస్తానని చెప్పారు. తద్వారా వారిని ప్రజలు మరిచేలా అభివృద్ధి చేస్తానని, ప్రజల్లోకి వెళ్తానని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చేస్తోంది మేం అని, తప్పుడు కేసులు పెట్టించుకుంది మేం అని, నాయకులను పోగొట్టుకుంది మేం అని ఆమె చెప్పారు.
చంద్రబాబుకు కానుక
నంద్యాలలో గెలవలేనని నేతలు కూడా తనను ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అఖిలప్రియ అన్నారు. ఆళ్లగడ్డ, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాలలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోను భూమా కుటుంబమే విజయం సాధిస్తుందని, ఆ విజయాన్ని తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కానుకగా ఇస్తామని చెప్పారు. చంద్రబాబుకు ఒకటే చెప్పానని, బూత్ కమిటీలు అని చెప్పి మీరు మమ్మల్ని పిలుస్తున్నారని, కానీ రెండింట్లో గెలిచి, పువ్వుల్లో పెట్టి ఇస్తానని చెప్పానని అన్నారు.
నాపై ఎవరిని నిలబెట్టాలో వారు నిర్ణయించుకోలేకపోతున్నారు
ఆళ్ళగడ్డలో తనపై పోటీకి ఎవరిని నిలబెట్టాలో నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో ప్రత్యర్థి పార్టీలు ఉన్నాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అఖిలప్రియ అన్నారు. ఈ ఎన్నికల్లో కొడుకును నిలబెట్టాలో, భార్యను నిలబెట్టాలో, సోదరుడిని నిలబెట్టాలో కూడా గంగుల ప్రభాకర్ రెడ్డికి అర్థం కావడం లేదని ఆమె అన్నారు. తనపై పోటీకి ఎవరిని నిలబెట్టాలో అర్థంకాక తికమకపడుతున్నారని చెప్పారు. ఆళ్లగడ్డ అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని చెప్పారు.
వాళ్లు కూడా వైసీపీలోకి వెళ్తున్నారు
మరొకరి పరిస్థితి విచిత్రంగా ఉందని మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నారని, కానీ ఏం చేశారో తెలియదని, ఇప్పుడు వాళ్లు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని అఖిలప్రియ అన్నారు. ఆళ్లగడ్డలో కీలక నేతగా ఉన్న రాంపుల్లారెడ్డిని ఉద్దేశించి ఆమె అన్నారు. ఆమె వైఖరి నచ్చక ఆయన టీడీపీకి రాజీనామా చేసి, వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనను ఉద్దేశించి అఖిలప్రియ మాట్లాడారు.
నాకు ఎన్నికలంటే భయం లేదు
ప్రత్యర్థులకు ఆళ్లగడ్డ నుంచి పోటీ చేయాలా, నంద్యాల నుంచి పోటీ చేయాలా, శ్రీశైలం నుంచి పోటీ చేయాలా అని ఆలోచిస్తున్నారని, ఎవరికి ఎక్కడి నుంచి పోటీ చేయాలో అర్థం కావటం లేదని అఖిలప్రియ అన్నారు. ప్రజలను చీటింగ్ చేసిన వాళ్లు మనకు ప్రత్యర్థులా, వీళ్లా రాజకీయాలు చేసేదని ఘాటుగా మాట్లాడారు. మీ కాలి గోటికి (భూమా వర్గం) కూడా వారు సరిపోరని వ్యాఖ్యానించారు. తనకు ఎన్నికలు అంటే భయం లేదని, మెజార్టీ మాత్రమే కావాలన్నారు. జనవరి 1వ తేదీ నుంచి 100 రోజులు అందరం కలిసి పని చేద్దామన్నారు. నంద్యాల, ఆళ్లగడ్డలలో ప్రతి ఓటు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డికి నివాళి కావాలన్నారు.