వచ్చే ఉగాదికి 25 లక్షల ఇళ్ల నిర్మాణం..! అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇస్తామన్న జగన్..!!
అమరావతి/హైదరాబాద్ : ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీల దిశగా ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. రైతులకు 9 గంటలపాటు పగటిపూట ఉచిత విద్యుత్తు అందించడంపై మిగిలిపోయిన వాటిలో ఫీడర్ల వారీగా ప్రణాళిక ఇవ్వాలన్న ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.రైతులకు ఉచిత విద్యుత్తు అంశాన్ని ప్రాధాన్యతా అంశంగా చూడాలని కలెక్టర్లకు సీఎం ఆదేశించారు.
ఎన్ని పంపుసెట్లకు కనెక్షన్లు ఇవ్వాలని సీఎం అధికారులను అడగగా దాదాపు 57వేలకుపైగా పంపుసెట్లకు కనెక్షన్లు ఇవ్వాలని అధికారులు సూచించారు. ఈ పనులను నిర్ణీత సమయంలోగా పూర్తిచేయాలని అధికారులకు జగన్ మరోసారి స్పష్టం చేశారు. ప్రతి పౌరుడూ ఒక చెట్టును నాటాలని, ఐదుకోట్ల మంది ప్రజలు ఐదుకోట్ల చెట్లు నాటలన్నది ఆలోచన ఆయన తెలిపారు. దీన్నొక ప్రత్యేక కార్యక్రమంగా చేపట్టండని, గ్రామ వాలంటీర్లను ఇందులో భాగస్వాములుగా చేయందని కలెక్టర్లకు సీఎం సూచించారు. స్కూలు, ఆస్పత్రుల్లో కూడా చెట్లను నాటలని, 25 కోట్లకుపైగా చెట్లను నాటేలా ప్రణాళిక రూపొందించమని కలెక్టర్లకు సీఎం ఆదేశించారు. చెట్ల సంరక్షణ బాధ్యతలను సీఎస్ఆర్ కింద పరిశ్రమలకు ఇవ్వమని,మొక్కల నాటడం, సంరక్షణపై శ్రద్ధ చూపాలని ఆయన కోరారు.
వచ్చే ఉగాది నాటికి 25 లక్షల ఇళ్లు నిర్మించాలని, లక్ష్యాలు నిర్దేశించుకుని ఆమేరకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వాలి. పట్టణాల్లో ఇప్పుడున్న ఫ్లాట్లను ఉచితంగా ఇస్తామని చెప్పాం వారికి కచ్చితంగా ఇస్తాం.ఇళ్లస్థలాల పంపిణికీ అవసరమైన భూములను గుర్తించండి.గ్రామాల వారీగా, పట్టణాలవారీగా భూములను ఎక్కడున్నాయో చూడండి.
దొరకని చోట కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధంచేయండి. మనం చేస్తున్న ఆలోచన పేదలకు గూడు కల్పించాలన్న సదాశయంతో ఉన్నదని ఏపి సీఎం జగన్ అన్నారు. గత ప్రభుత్వంలో గృహనిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని, లిఫ్టులేని, మార్బుల్ ఫ్లోరింగ్ లేని ఇళ్లను 6లక్షల రూపాయలకు అమ్మారని, 1100-1200 కోట్ల రూపాయలు అయిన చోట 2200 కోట్ల రూపాయల పైగా ఖర్చుచేశారని,భారీ అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. మంచి పని కాబట్టి, దేవుడు కచ్చితంగా ఆశీర్వదిస్తాడని, ఈ కార్యక్రమం కచ్చితంగా అమలు అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు