తహశీల్దార్ కార్యాలయాలే టార్గెట్: ఏసీబీ మెరుపుదాడులు: అదుపులో సిబ్బంది..!
అమరావతి: అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపుదాడులకు దిగారు. తహశీల్దార్ కార్యాలయాలను టార్గెట్గా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా దాడులను చేపట్టారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఏకకాలంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. లంచం తీసుకుంటున్న పలువురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులను నమోదు చేశారు.
అవినీతి నిరోధక శాఖ అధికారుల పనితీరు బాగుండట్లేదంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజుల కిందటే అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాతే సీనియర్ ఐఎఎస్ అధికారి పీ సీతారామాంజనేయులును ఏసీబీ డైరెక్టర్ జనరల్గా నియమించారు. ఆయన బాధ్యతలను స్వీకరించిన తరువాత.. రాష్ట్రవ్యాప్తంగా తహశీల్దార్ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులను చేపట్టారు అధికారులు.
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై ఫిర్యాదులను స్వీకరించడానికి ఏర్పాటు చేసిన 14400 నంబర్కు అందిన ఫోన్ కాల్స్ ఆధారంగా ఈ దాడులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల వారీగా విభజించారని, అనంతరం- ఫిర్యాదులు పెద్ద మొత్తంలో అందిన తహశీల్దార్ కార్యాలయాలపై ఈ దాడులను చేపట్టినట్లు ఏసీబీ డైరెక్టర్ జనరల్ కార్యాలయం అధికారులు చెబుతున్నారు.
శ్రీకాకుళం మొదలుకుని చిత్తూరు వరకూ దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఈ ఏకకాలంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. చిత్తూరు జిల్లాలోని రేణిగుంట, వడమాల పేట, చంద్రగిరి, చిత్తూరు రూరల్ వంటి చోట్ల దాడులు ముమ్మరం అయ్యాయి. అనంతపురం జిల్లా ముదిగుబ్బ, కదిరి, కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం వంటి చోట్ల ఏసీబీ అధికారులు విస్తృతంగా దాడులను కొనసాగిస్తున్నారు. ఈ దాడుల సందర్భంగా అధికారులు పెద్ద సంఖ్యలో పాస్ పుస్తకాలకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు.