రూ. 100 కోట్ల సంపాదన : ఏసిబి కి ఇలా చిక్కాడు ..
మొదటి నెల జీం పది వేలు మాత్రమే కానీ. నేడు 100 కోట్ల సంపాదన. ఏసిబి అధికారులే విస్తుపోయే విధంగా అక్రమార్జన. ఒక్కేడ కాదు..కుటుంబ సభ్యులు..బంధువుల పేరుతో చాకచక్యంగా ఆస్తులు. ఇక, కిలోల లెక్కన బంగారం..వెండి ఆభర ణాలు..స్థిర-చరాస్థులు. దీంతో..ఏసిబి అధికారులు పక్కప్లాన్ తో వ్యవహరించి ఈ అవినీతి తిమింగళాన్ని పట్టుకున్నారు..
ఏపి ఏసిబి అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. ఓ సాధారణ ఉద్యోగి అనతికాలంలోనే వంద కోట్ల కు పైగా ఆస్తు లు సంపాదింది అధికారుల వలలో చిక్కుకున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఎస్.పి.డి దివాకర్ ఇళ్లపై అనిశా అధికారులు ఏకకాలంలో దాడులు జరిపారు.
ఏసిబి సోదాల్లో పట్టుబడిన ఆస్తుల వివరాలు చూసి అధికారులే విస్తుపోయారు. దివాకర్తో పాటు ఆయన తల్లి వెంకట సుబ్బలక్ష్మి, సోదరుడు కిరణ్కుమార్ల పేరిట ఉన్న భూములు, ఇతర ఆస్తులను అధికారులు గుర్తించారు. దివాకర్ పేరిట తణుకు, ఉండ్రాజవరం మండలం పాలంగి, గోపాలపురం మండలం బీమోలులో నాలుగు భవంతులు ఉన్నాయి. ఏడు ఇళ్లస్థలాలు, 44 ఎకరాల 39 శెంట్ల వ్యవసాయ భూములు ఉన్నట్టు గుర్తించారు. సోదరుడు కిరణ్కుమార్ పేరిట ఆరు ఇళ్లస్థలాలు, 23 ఎకరాల 11సెంట్ల వ్యవసాయభూమి ఉంది.
భారీ స్థిర - చర ఆస్తులు..
ఏసిబి సోదాల్లో మొత్తం మీద 19 ఇళ్లస్థలాలు, నాలుగు భవంతులు, 85 ఎకరాల 62సెంట్ల వ్యవసాయభూమితోపాటు .. అరకిలో బంగారం, ఐదు కిలోల వెండి వస్తువులు, రూ.5లక్షల నగదు, రూ.60వేల విలువ చేసే విదేశీ కరెన్సీ, 5 కార్లు, 2 ద్విచక్రవాహనాలతో పాటు రూ.30లక్షల విలువ చేసే గృహోపకరణాలు గుర్తించారు. అనిశా అధికారులు గుర్తించిన వాటిలో సుమారు రూ.5 లక్షల విలువైన రోలెక్స్వాచీ, ఒక్కోటి రూ. లక్ష విలువైన మరో నాలుగు వాచీలు ఉన్నాయి. ఏసిబి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసారు.