నాడు తండ్రి నేడు తనయుడు: ఇఛ్చాపురంలో ముగియనున్న జగన్ పాదయాత్ర..ఇవీ విశేషాలు
Recommended Video
నాడు తండ్రి, మొన్న తనయ, నేడు తనయుడు ఒకే కుటుంబం నుంచి ముగ్గురు పాదయాత్ర చేసిన ఘనత ఒక్క వైయస్ ఫ్యామిలీకే దక్కుతుందేమో. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన పాదయాత్ర బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియనుంది. ఇందుకోసం వైసీపీ భారీ ఏర్పాట్లను చేసింది. అయితే ఇచ్ఛాపురంలో జరిగే బహిరంగ సభలో జగన్ ఏం చెబుతారా అని ఇటు స్థానిక రాజకీయ నేతలు జాతీయ స్థాయి రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. మరోవైపు ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తారో అనేదానిపై కూడా ఇటు కార్యకర్తలు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పాదయాత్రకు శ్రీకారం చుట్టిన వైయస్ రాజశేఖర రెడ్డి
2004లో నాడు వైయస్ రాజశేఖర రెడ్డి తలపెట్టిన పాదయాత్రతో ప్రజలు ఆయన్ను అఖండ మెజార్టీతో దీవించారు. అప్పటికే తొమ్మిదేళ్ల తెలుగుదేశం పాలనతో ప్రజలు విసిగి వేశారి పోయిన నేపథ్యంలో అప్పటి వైయస్ పాదయాత్ర ప్రజలకు భరోసా కల్పించింది. దీంతో ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీని ప్రజలు పాతాళానికి తొక్కేశారు. వైయస్ పాదయాత్రతోనే ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని నాడు టీడీపీ నేతలే ఒప్పుకున్న పరిస్థితి. వైయస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు 2009లో మరోసారి ప్రజలు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పట్టం కట్టారు. అయితే అప్పుడు ప్రజలు తమకు కేవలం పాస్ మార్కులు మాత్రమే వేశారని వైయస్ఆర్ వ్యాఖ్యానించారు. నాడు వైయస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం, ఫీజు రీఇంబర్స్మెంట్, పలు రైతు సంక్షేమ పథకాలతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగి పోయింది. వైయస్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. వైయస్ మరణం తర్వాత రాజకీయ పరిస్థితులు మారిన నేపథ్యంలో ఆయన తనయుడు వైయస్ జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం కొత్త పార్టీ పెట్టడం అన్నీ చకచకా జరిగిపోయాయి.
జగన్ సమరనాదం : బస్సు యాత్రకు ముమూర్తం ఫిక్స్ : ఇక..ఏపి నడిబొడ్డు నుండే..!
ఇడుపుల పాయా టూ ఇఛ్చాపురం
తాజాగా ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్ కూడా ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర మొదలు పెట్టారు. 2017 నవంబర్లో జగన్ ప్రజాసంకల్ప యాత్రను కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభించారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ సాగారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన బహిరంగసభల్లో చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ ఆయన పాదయాత్ర సాగింది. టీడీపీ ప్రభుత్వంలో అవినీతి తారాస్థాయికి చేరిందని ధ్వజమెత్తారు జగన్.
జగన్ పాదయాత్రతో బలయ్యే పార్టీ ఏది..?
ప్రజాసంకల్పయాత్ర పేరుతో వైయస్ జగన్ చేపట్టిన పాదయాత్ర మొత్తం 3648 కిలోమీటర్లు సాగింది. మొత్తం 134 నియోజకవర్గాలను జగన్ కవర్ చేశారు. భారతదేశంలో ఒక రాజకీయనాయకుడు ఇన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఘనత ఒక్క జగన్కే దక్కిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కావాలి జగన్ రావాలి జగన్ నినాదంతో వైసీపీ అధినేత కొన్ని లక్షల మంది ప్రజలను కలుసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా వైయస్ పాదయాత్ర దెబ్బకు చంద్రబాబు ఒకసారి బలయ్యారని మరోసారి అదే కుటుంబం నుంచి వచ్చిన యువనేత జగన్ దెబ్బకు చంద్రబాబు పాపులారిటీ పడిపోతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2004 ఫలితాలు రిపీట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని వారు వెల్లడిస్తున్నారు.
జగన్ పాదయాత్ర దెబ్బకు చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు: వైసీపీ
ఇక టీడీపీ కాంగ్రెస్ పొత్తు వల్ల తెలంగాణలో కాంగ్రెస్కు పెద్ద దెబ్బపడిందని ఆంధ్రలో కూడా ఇలాంటి ఫలితాలే రావొచ్చనే భావన ఉందని పొలటికల్ అనలిస్టులు భావిస్తున్నారు. అంతేకాదు జగన్ పాదయాత్ర వల్లే బీజేపీ నుంచి చంద్రబాబు బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని అక్కడే వైసీపీ తొలి విజయం సాధించిందని అనలిస్టులు చెబుతున్నారు. పాదయాత్రకు వచ్చిన అశేష స్పందనతో చంద్రబాబు తప్పని పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని వైసీపీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారంటే అది జగన్ పాదయాత్ర వల్లే జరిగిందన్నారు. నాలుగేళ్లుగా స్పెషల్ ప్యాకేజీని ప్రమోట్ చేసిన చంద్రబాబు ఒక్కసారిగా ప్రత్యేక హోదా నినాదం ఎత్తుకోవడం అది వైసీపీ విజయమే అని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.
అసెంబ్లీకి వెళ్లని ప్రతిపక్షనేతగా జగన్ పై విమర్శలు
ఒక ప్రతిపక్ష నేత హోదాలో ఉండి జగన్ కానీ వైసీపీ కానీ అసెంబ్లీ సభలకు హాజరుకాకపోవడంపై కూడా విమర్శలు వచ్చాయి. దీన్ని కూడా వైసీపీ సమర్థిస్తోంది. ప్రజల సమస్యలపై అసెంబ్లీలో లేవనెత్తితే వెంటనే స్పీకర్ మైకును కట్ చేస్తున్నారని అలాంటప్పుడు ప్రజల సమస్యలను అసెంబ్లీలో ఎలా వినిపిస్తామని ప్రశ్నిస్తోంది. అందుకే సమస్యలు చెప్పేందుకు పాదయాత్ర వేదికైందని వెల్లడించారు. సమస్యలను అసెంబ్లీలోనే చెప్పాల్సిన పనిలేదని ప్రజల మధ్య కూడా రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడే అవకాశం దక్కిందని... ఈ క్రమంలోనే చంద్రబాబు ప్రత్యేక హోదాపై యూటర్న్ తీసుకోవడం జరిగిందని వైసీపీ చెబుతోంది. మొత్తానికి జగన్ తలపెట్టిన ప్రజాసంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇఛ్చాపురంలో ముగియనుంది. అక్కడ జగన్ పాదయాత్రకు చిహ్నంగా పెద్ద పైలాన్ ఆవిష్కరించనున్నారు.