టిడిపితో పొత్తు : డైలమా లో రాహుల్ : 25న కీలక సమావేశం..
Recommended Video
టిడిపి తో పొత్తు పై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ డైలమా లో ఉన్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ లో ప్రజా కూటమి పేరు తో పొత్తు పెట్టుకొని..రాహుల్ - చంద్రబాబు ఇద్దరూ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కానీ, ప్రతికూల ఫలితాలు వచ్చాయి. పలువురు కాంగ్రెస్ నేతలు టిడిపి పొత్తుతో నష్టపోయామని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో..ఇప్పుడు ఏపి లో పొత్తు పై నిర్ణయం కోసం రాహుల్ ఓ సమావేశం ఏర్పాటు చేసారు.
కొనసాగిద్దామా..25న ఢిల్లీకి రండి..
తెలుగుదేశంలో కుదిరిన పొత్తును ఏపిలో కొనసాగించాలా..లేక, ఆ పొత్తును జాతీయ రాజకీయాలకే పరిమితం చేయాలా అనే అంశం పై కాంగ్రెస్ అధినేత దృష్టి సారించారు. తెలంగాణ లో పొత్తు ప్రతికూల ఫలితాలు రావటంతో ఏపిలో ఏం చేద్దామనే అంశం పై ఇప్పుడు ఏపి కాంగ్రెస్ నేతలతో ఆరా తీస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచార సమయంలో ఏపి లో పొత్తు విషయం పై టిడిపి అధినేత కు పూర్తి స్వేఛ్చ ఇచ్చారు రాహల్ గాంధీ. ఏపి లో పరిస్థితికి అనుగుణంగా కలిసి పోటీ చేయాలా..
విడివిడిగా పోటీ చేయాలా అనే అంశం పై నిర్ణయం చంద్రబాబు కే వదిలేసారు. అయతే, తెలంగాణ లో ఫలితాల తరువాత రాహుల్ ఆలోచనలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ఏపిలో పొత్తు కొనసాగింపు పై చర్చిచేందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఊమెన్ చాందీ, పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డిని ఆదేశించారు. అయితే.. ఆ రోజున ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నందున, ఈనెల 25న ఢిల్లీకి వస్తామని రాహుల్ నుంచి ఊమెన్ చాందీ అనుమతి తీసుకున్నారు.
కాంగ్రెస్ లో మిశ్రమ స్పందన..
తెలంగాణ ఫలితాల తరువాత ఏపి కాంగ్రెస్ నేతల్లో టిడిపి తో పొత్తు అంశం పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏపి లోని 175 నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను ఇప్పటికే పిసిసి చీఫ్ రఘువీరా సేకరించారు. ఇందులో పార్టీ నేతల నుండి మిశ్రమ స్పందన వ్యక్తం అయింది. ఏపిలో పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయిన తమకు టిడిపి తో పొత్త కారణంగా మేలు జరుగుతుందని కొందరు పిసిపి కి నివేదించారు. మరి కొందరు నేతలు ఇప్పుడు కాకపోతే..వచ్చే ఎన్నికల నాటికైనా పుంజుకుంటామని..టిడిపి తో పొత్తు పెట్టుకుంటే మొత్తానికే నష్టం వస్తుందని వాదిస్తున్నారు. కానీ, ఇదే సమయంలో టిడిపి తో పొత్తు పై ఆ పార్టీ నేతల స్పందనకు అనుగుణంగానే ముందుకు వెళ్లాలని..కాంగ్రెస్ నుండి పదేపదే ఈ ప్రతిపాదన పై చర్చ మంచిది కాదని సూచించినట్లు సమాచారం. పార్టీ అధినాయకత్వం నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుందామని పిసిసి భావిస్తోంది.
టిడిపి లోనూ అనిశ్చితే..
ఏపిలో కాంగ్రెస్ తో పొత్తు కొనసాగింపు పై టిడిపి లోనూ అనిశ్చితే కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో సానుకూల ఫలితా లు వస్తే ఏపిలోనూ పెద్దగా ఇబ్బందులు ఉండవని టిడిపి నేతలు అంచనా వేసారు. అయితే, ఫలితాలు వ్యతిరేకంగా రావటంతో..ఇక్కడ కూడా అదే ప్రభావం చూపుతుందనే అందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోని ఏపి సెటిలర్స్ ఉన్న ప్రాంతంలో సైతం కూటమికి అనుకూలంగా ఓట్లు పడలేదని..దీని ద్వారా కాంగ్రెస్ తో పొత్తును ఏపి ప్రజలు అంగీకరించటం లేదనే విషయం అర్దమవుతోందని కొందరు టిడిపి నేతలు విశ్లేషిస్తున్నారు.
అయితే, జాతీయ స్థాయిలో పొత్తు కొనసాగిస్తూ..తెలంగాణ లో పొత్తు పెట్టుకొని..ఏపి లో నిరాకరిస్తే ప్రజలకు ఎటువంటి సంకేతాలు వెళ్తాయనే ఆందోళన కూడా టిడిపి నేతలను వెంటాడుతోంది. దీని పై లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని వారు పార్టీ అధినేతకు సూచిస్తున్నారు.