సింగపూర్ లో అమరావతి సునామీ: రాజకీయంగా ప్రకంపనలు: బిలియన్ డాలర్లు వృధా అంటూ..!
ఏపీ అమరావతి రాజధాని వ్యవహారం ఏపిలోనే కాదు..ఇప్పుడు సింగపూర్ లో రాజకీయ అంశంగా మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సింగపూర్ సంస్థలతో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న స్టార్టప్ ఏరియా డెవలప్ మెంట్ ఒప్పందం తాజాగా రద్దు అయింది. ఏపీ ప్రభుత్వం..సింగపూర్ ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటికే ప్రకటనలు కూడా చేసాయి. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత రాజధానిలో నిర్మాణాలను పూర్తిగా నిలిపివేసారు. దీని పైన రాజకీయంగానే కాకుండా...జాతీయ స్థాయిలో చర్చగా మారింది. అసలు అమరావతి రాజధానిగా కొనసాగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. తాజాగా ముఖ్యమంత్రి దీని పైన స్పష్టత ఇస్తూ నిర్మాణాల కొనసాగింపుకు ఆమోదం తెలిపారు. ఇదే సమయంలో సింగపూర్ లోనూ ఇదే వ్యవహారం రాజకీయ దుమారానికి కారణమైంది. స్టార్టప్ ఏరియా ఒప్పందం కోసం బిలియన్ డాలర్లు వృధా చేసారంటూ అక్కడి ప్రతిపక్ష నేతలు విరుచుకుపడ్డారు.
అదిగదిగో అమరావతి: సరికొత్త మ్యాప్ ను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం..!
సింగపూర్ ను తాకిన అమరావతి రాజకీయం
ఏపీలో అమరావతిలో సింగపూర్ కు చెందిన రెండు సంస్థలు అక్కడి ప్రభుత్వ పర్యవేక్షణలో ఏపీ ప్రభుత్వంలో ఒక ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో రాజధానిలో స్టార్టప్ ఏరియా డెవలప్ మెంట్ కోసం ఈ ఒప్పందం జరిగింది. అయితే, చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఇది సింగపూర్ సంస్థలకు భూములు అప్పగించి..ఏపీ ప్రభుత్వం నుండి పెద్ద మొత్తంలో భూములు కట్ట బెట్టారంటూ రాజకీయంగా ఆరోపణలు వెల్లు వెత్తాయి. ఈ ప్రాజెక్టు పైన టీడీపీ హాయంలోనూ ఎటువంటి పురోగతి లేదు. ఇక, జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత సింగపూర్ ప్రభుత్వంతో చర్చలు చేసారు. రెండు ప్రభుత్వాల పరస్పర అంగీకారంతో ఈ స్టార్టప్ ఏరియా ఒప్పందం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారంలో సింగపూర్ లోనూ రాజకీయంగా ప్రకంపనలకు కారణమైంది.
బిలియన్ డార్లు వృధా చేసారంటూ..
ఏపీ రాజధానిలో స్టార్టప్ ఏరియా ఒప్పందం రద్దు అయినా.. ఏపీ లోనే కాదు..సింగపూర్ లోనూ దీని పైన రాజకీయంగా హాట్ చర్చ సాగుతోంది. అమరావతి ప్రాజెక్టులో సింగపూర్ కంపెనీలు నాలుగు బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాయని..అది బూడిదలో పోసినట్లయిందని సింగపూర్ విపక్ష నేత బ్రాడ్ బోయర్ ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసారు. దీనిని సింగపూర్ ప్రభుత్వం ఖండించింది. అసలు సింగపూర్ సంస్థలు భారీ ఖర్చేమీ పెట్టలేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో సింగపూర్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ప్రొటెక్షన్ ఫ్రం ఆన్ లైన్ పాల్స్ హుడ్స్ అండ్ మానిప్యులేషన్స్ చట్టం కింద ఈ పోస్టింగ్ లు చేసిన విపక్ష నేత మీద ప్రయోగించింది. వెంటనే ఆ పోస్టులు తొలిగించాలని ఆదేశించింది.
వివరణ ఇచ్చిన సింగపూర్ ప్రభుత్వం..
ఈ ఆరోపణలకు సింగపూర్ ఆర్దిక మంత్రి వివరణ ఇచ్చారు. తాము అమరావతిలో క్షేత్ర స్థాయిలో ఎలాంటి పనులు ప్రారంభించలేదని..దానికేమీ ఖర్చు పెట్టలేదనే విషయాన్ని సింగపూర్ కన్సార్షియం స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేసారు. డిజైన్ల రూపకల్పన వంటి పనులకు కొన్ని మిలియన్ల డాలర్లు ఖర్చు అయిందని స్పష్టం చేసారు. అక్కడ బిలిన్ల డార్లు ఖర్చు పెట్టారన్న వ్యాఖ్యలను బోయర్ విత్ డ్రా చేసుకోవాలని సూచించారు. కానీ, విపక్ష నేత బోయర్ మాత్రం తన వ్యాఖ్యలను ఉప సంహరించుకోలేదు. దీనికి ప్రభుత్వం ఇచ్చిన వివరణ జత చేసారు. ఇప్పుడు దీని ద్వారా..ఏపీలోనే కాకుండా..సింగపూర్ లోనూ రాజధాని అమరావతి వ్యవహారం పైన హాట్ హాట్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. దీనికి అక్కడి ప్రభుత్వం ఎలాంటి ముగింపు ఇస్తుందో చూడాలి.