అమరావతి నిరసనలకు 300 రోజులు: ప్రదర్శనల హోరు.. నినాదాల జోరు: తీవ్ర ఉద్రిక్తత
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన తరువాత.. అమరావతి ప్రాంతం నిప్పుల కుంపటిలా మారింది. మూడు రాజధానులను నిరసిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసనల కార్యక్రమాలు, వ్యతిరేక ప్రదర్శనలు ఆదివారం నాటికి 300 రోజులకు చేరుకున్నాయి. ఇంత సుదీర్ఘకాలం పాటు నిరసన ప్రదర్శనలను చేపట్టిన సందర్భాలు చరిత్రలో లేవని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. అయినప్పటికీ.. ప్రభుత్వంలో చలనం రావట్లేదని మండిపడుతున్నారు.
మూడు రాజధానుల ప్రకటన వెలువడినప్పటి నుంచీ..
అమరావతిలో చట్టసభలను కొనసాగిస్తూనే.. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయిస్తామంటూ వైఎస్ జగన్ గత ఏడాది నిండు అసెంబ్లీలో ప్రకటించారు. ఆ ప్రకటన వెలువడిన రోజు నుంచే నిరసన కార్యక్రమాలు ఆరంభం అయ్యాయి. సచివాలయం, హైకోర్టు తరలి వెళ్లడం వల్ల తమ భూముల విలువ పడిపోతుందని, ఫలితంగా తాము నష్టపోతామంటూ అమరావతి ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నిరసన దీక్షలను ఆరంభించారు. అమరావతి గ్రామాల్లో నిరసన శిబిరాలు వెలిశాయి.
300 రోజులకు..
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. ఆ ప్రాంత రైతుల నిరసనలు ఆదివారం నాటికి 300 రోజులకు చేరుకున్నాయి. దీన్ని పురస్కరించుకుని అమరావతి పరిరక్షణ సమితి నేతలు భారీ ర్యాలీని నిర్వహించారు. అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. తుళ్లూరులో, మందడం, పెదపరిమి వంటి గ్రామాల్లో నిరసన ప్రదర్శనలను చేపట్టారు. బ్యానర్లను ప్రదర్శించారు. ర్యాలీలో ఆయా గ్రామాల నుంచి రైతులు, మహిళలు భారీగా తరలివచ్చారు. వివిధ ప్రజా సంఘాలు నేతలు ఇందులో పాల్గొన్నారు. రైతులకు అండగా నిలిచారు.
ముఖ్యమంత్రి ఒక్కసారైనా..
ఈ 300 రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కసారైనా తమను కలవలేదని, తమ గోడును ఆలకించలేదని అమరావతి పరిరక్షణ సమతి నేతలు ఆరోపించారు. రైతు కన్నీరు పెట్టిన నేల దుర్భిక్షభరితం అవుతుందే తప్ప.. ఎలాంటి ఉపయోగం ఉండబోదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న ప్రజలను పరామర్శించడం ప్రభుత్వం కనీస బాధ్యత అని, రైతులు 300 రోజులుగా దీక్ష చేస్తున్నా ముఖ్యమంత్రి మూడు నిమిషాలు కూడా తమతో మాట్లాడలేదని అన్నారు.
Recommended Video
బడుగు, బలహీనులే..
మూడు రాజధానులను ఏర్పాటు చేయడాన్ని ఎవరూ కోరుకోవట్లేదని అమరావతి జేఏసీ నేతలు చెప్పారు. రాజధానిని ఒకేచోట కేంద్రీకరించాలని ఇతర ప్రాంతాల ప్రజల కూడా కోరుకుంటున్నారని అన్నారు. దీనిపై తాము ఇదివరకే నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ బ్యాలెట్లో తేలిందని స్పష్టం చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల్లో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలేనని చెప్పుకొచ్చారు. కరోనా ప్రొటోకాల్ అమల్లో ఉండటం వల్ల నిరసన ర్యాలీలకు అనుమతుల్లేవంటూ పోలీసులు కొన్ని చోట్ల రైతలను అడ్డుకున్నారు. దీనితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.