నిలదీస్తారా..బుజ్జగిస్తారా: అమరావతి వైసీపీ నేతల కీలక భేటీ: ఏం తేల్చనున్నారు..!
అమరావతి ప్రాంత వైసీపీ నేతలు సమావేశం అవుతున్నారు. అమరావతి నుండి రాజధాని తరలింపు ప్రతిపాదన..జీఎన్ రావు కమిటీ సిఫార్సులు..ఆ ప్రాంత రైతులు..స్థానికుల ఆందోళనల నేపత్యంలో వీరి భేటికి ప్రాధాన్యత ఏర్పడింది. 27న జరిగే కేబినెట్ సమావేశంలో జీఎన్ రావు కమిటీ సిఫార్సులకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేయనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో అమరావతి రైతుల ఆందోళన అవసరం లేదంటూ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే ఆ ప్రాంత వైసీపీ నేతలు రాజీనామా చేయాలంటూ డిమాండ్లు మొదలయ్యాయి. మంగళగిరి..తాడికొండ ఎమ్మెల్యేలు కనిపించటం లేదంటూ పోలీసు స్టేషన్లలో స్థానికు లు ఫిర్యాదులు చేసారు. ఈ సమయంలో ఈ ప్రాంత వైసీపీ నేతలు ఏం చర్చించనున్నారు. ఏం తేల్చనున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి అండగా నిలుస్తారా..రైతులకు భరోసా ఇస్తారా..
అమరావతి వైసీపీ నేతల సమావేశం..
ఏపీ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలింపు పైన నిర్ణయం తీసుకుంటున్న వేళ..అమరావతి ప్రాంత వైసీపీ నేతలు సమావేశం అవుతున్నారు. నేడు వైసీపీ కేంద్ర కార్యాలయంలో అమరా వతి ప్రాంత వైసీపీ ప్రజాప్రతినిధులు సమావేశం కానున్నారు. కానున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటుకు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు, అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు చేస్తోన్న ఆందోళన, రాయలసీమలో రాజధాని నిర్మాణం జరగాలంటూ ఆ ప్రాంతం నుంచి వస్తోన్న డిమాండ్ తదితరాలపై సమీక్షించనున్నారు. మూడు రాజధానులం టూ అసెంబ్లీలో జగన్ వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి అమరావతి ప్రాంతంలో ఆందోళనలు సాగుతున్నాయి. అఖిలపక్షంగా ఏర్పడిన మిగిలిన పార్టీల నేతలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీంతో.. ఇప్పుడు వీరి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
రైతుల ఆగ్రహాన్ని చల్లబరిచేలా...
అధికారంలోకి వస్తే రాజధాని అమరావతిలోనే ఉంటుందని..2019 ఎన్నికల ముందు వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు అప్పట్లోనే హామీ ఇచ్చారు. ఇది పార్టీ తరపున చేస్తున్న ప్రకటనగా చెప్పారు. ఇక, బొత్సా పలుమార్లు రాజధాని పైన వ్యాఖ్యలు చేసిన సందర్బంలోనూ పలువురు రాజధాని పరిధిలోని వైసీపీ నేతలు అమరావతి నుండి రాజధాని తరలించే అవకాశం లేదని వాదించారు. అయితే, ఇప్పుడు స్థానికులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించటం.. అన్ని పార్టీలు వారికి మద్దతుగా నిలుస్తుండటంతో వారి భేటీలో రైతులకు భరోసా ఇచ్చేలా వారి కార్యాచరణ ఉంటుందని సమాచారం. ప్రభుత్వంలో ఉన్న తాము అమరావతి రైతులకు గతం కంటే మెరుగైన ప్యాకేజి అమలయ్యేలా బాధ్యత తీసుకుంటామని..హామీ ఇస్తారని తెలుస్తోంది. అదే విధంగా రైతుల తరపున ఇతర పార్టీలకు అవకాశం లేకుండా రైతులతో సమావేశమై వారి ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు ఉంచి..ఒప్పించి ఆ క్రెడిట్ తామే తీసుకోవాలని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం.
ప్రభుత్వ నిర్ణయం వైపే వైసీపీ నేతలు..
రాజధాని పరిధి విస్తరించి ఉన్న రెండు జిల్లాల్లోనూ వైసీపీకి 30 మంది ఎమ్మెల్యేలు.. నలుగురు ఎంపీలు ఉన్నారు. అయితే, తొలి నుండి రాజధాని విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతి పాల్పడిందని.. అక్కడ ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు..ఇప్పుడు తమ ప్రభుత్వం విశాఖకు సచివాలయం తరలింపు ప్రతిపాదపైన మాత్రం ఆచితూచి స్పందిస్తున్నారు. అయితే, ఇతర పార్టీలు స్థానికులకు మద్దతుగా నిలుస్తున్న సమయంలో వారి పైన ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే మంత్రి కొడాలి నాని క్రిష్టా జిల్లాకు చెందిన వాడిగా ముఖ్యమంత్రి ప్రతిపాదనను స్వాగతిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఇక, ఇప్పుడు రాజధాని మార్పుకు సహకరిస్తూనే..రైతుల పక్షాన నిలబడాలనేది వైసీపీ నేతల వ్యూహంగా కనిపిస్తోంది. దీని ద్వారా.. అటు ప్రభుత్వానికి..ఇటు రైతులకు మధ్య వారధిలా పని చేయాలని అమరావతి ప్రాంత వైసీపీ నేతలు భావిస్తున్నారు. మరి..అమరావతి ప్రాంత స్థానికులు..రైతుల నుండి వారికి మద్దతు లభిస్తుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.