ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కడప జిల్లాకు చెందిన అంబటి కృష్ణారెడ్డి .. క్యాబినెట్ హోదా కూడా !!
ఏపీలో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ సలహాదారులకు పని లేకుండా ఖాళీగా ఉంటున్నారని, అనవసరంగా వారి కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నా ఏపీ ప్రభుత్వం మాత్రం తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది . రెండు రోజుల క్రితమే రామచంద్రమూర్తి ప్రభుత్వ సలహాదారుగా రాజీనామా చెయ్యగా ఆంధ్ర ప్రదేశ్ లో మరో సలహాదారుని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన అంబటి కృష్ణారెడ్డి వ్యవసాయానికి సంబంధించిన అంశాలలో ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు సలహాదారుగా నియమించింది.
అంబటి కృష్ణారెడ్డి క్యాబినెట్ ర్యాంక్ కలిగి ఉంటారు.రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.అంబటి కృష్ణారెడ్డికి వేతనము, అలవెన్సులు, వాహనం ఖర్చులు, ఇంటి అద్దె తదితరాలు, సెక్యూరిటీ అన్నీ మంత్రులకు ఎలాంటి వసతులు ఉంటాయో అన్ని వసతులను కల్పించనున్నారు. దీనికోసం ఆయనకు నెలకు 80 వేల చొప్పున చెల్లించనున్నారని తెలుస్తుంది. అంతేకాదు ఆయన కారు కొనుక్కోడానికి పదిలక్షల లోన్ లేదా అడ్వాన్స్ ను ప్రభుత్వం ఇవ్వనుంది . కంప్యూటర్ కొనుగోలు కోసం, ఫర్నిచర్ కొనుగోలు కోసం, ఇతర సామాన్లు కొనుగోలు కోసం కూడా ఆయనకు లోన్ సదుపాయాన్ని అందించనున్నారు. ప్రభుత్వం తరఫున 2 ఫోన్ కనెక్షన్లు కూడా అందిస్తారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటివరకు ప్రభుత్వానికి సలహాదారులుగా ఇప్పటికి 33 మందిని నియమించారు. వీరిలో పదిమందికి క్యాబినెట్ హోదా కూడా ఉంది.ఇటీవల ఏపీ ప్రభుత్వ ప్రజా విధానాల సలహాదారు రామచంద్రమూర్తి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సీనియర్ మోస్ట్ జర్నలిస్టుగా, పలు పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించిన ఆయన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఆయన రాజీనామా వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏమిటో తెలియరాలేదు. ఆయన రాజీనామాతో ప్రతిపక్ష పార్టీలు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. అయినా అవి లెక్కచేయకుండా తాజాగా మరొకర్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సలహాదారుగా నియమించింది.