బాబు ఓటమి ఖాయమని జాతీయ సర్వేలు చెప్పాయి, ఊసరవెళ్లి సిగ్గుపడేలా: ఏపీ ప్రజలకు అమిత్ షా లేఖ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షులు అమిత్ షా సోమవారం నాడు బహిరంగ లేఖ రాశారు. వచ్చే ఎన్నికల్లో దారుణమైన ఓటమి ఉంటుందని తెలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక యూటర్న్లు తీసుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు రక్తంలోనే కాంగ్రెస్ పార్టీ
చంద్రబాబు రక్తంలోనే కాంగ్రెస్ పార్టీ ఉందని అమిత్ షా ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు రాజకీయ ఓనమాలు నేర్పిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్దమని, ఆ పార్టీ నేర్పిన ఓనమాలు చంద్రబాబు కూడా దిద్దారని, అందుకే ఆయన అబద్దాలు ఆడుతున్నారని చెప్పారు. దుగ్గరాజుపట్నం సాధ్యం కాదని చెప్పి, వేరే ప్రాంతాన్ని సూచించారని తాను అడిగానని చెప్పారు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఇంత వరకు స్పందించలేదని అన్నారు.
జాతీయ సర్వేలు చంద్రబాబు ఓటమి చెబుతున్నాయి
చంద్రబాబుకు దారుణమైన ఓటమి తప్పదని జాతీయ సర్వేలు చెప్పాయని, చెబుతున్నాయని అమిత్ షా అన్నారు. మహా కల్తీ కూటమిలో చంద్రబాబు చేరారని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీకి వస్తే గౌరవం ఇవ్వలేని వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు.
మాటకు మాట: 'గో బ్యాక్'ను పాజిటివ్గా తీసుకున్న మోడీ, బాబుకు ఆరు గట్టి చురకలివే! నవ్విన పురంధేశ్వరి
ఊసరవెళ్లి సిగ్గుపడేంతగా చంద్రబాబు రంగులు మార్చారు
కాంగ్రెస్ పార్టీ చెంత చేరి చంద్రబాబు అనేక యూటర్న్లు తీసుకున్నారని అమిత్ షా ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా సంజీవిని కాదని చంద్రబాబు గతంలో చెప్పారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వాళ్లను జైళ్లలో పెట్టించారన్నారు. ఊసరవెల్లి కూడా సిగ్గుపడేంతగా చంద్రబాబు రంగులు మార్చుతున్నారని చెప్పారు.
విభజన హామీల అమలుకు పదేళ్ల సమయం ఉన్నా..
విభజన హామీల అమలుకు పదేళ్ల సమయం ఉన్నప్పటికీ తాము అయిదేళ్లలో చాలా వాటిని పూర్తి చేశామని అమిత్ షా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్లే కడప స్టీల్ ప్లాంట్ పైన కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేకపోతోందన్నారు.