ఏపీ కేబినెట్ మళ్లీ వాయిదా - వరుసగా మూడోసారి- రాష్ట్రంలో తొలిసారి...
ఏపీలో గతేడాది అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పాలనను పరుగులు తీయించే లక్ష్యంతో వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. వీటి అమలు కావాలంటే కేబినెట్ అనుమతి తప్పనిసరి. అందుకే ప్రతీ నెలా రెండో, నాలుగో బుధ లేదా గురు వారాల్లో కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తోంది. ఒకట్రెండు సార్లు మిస్సయినా సాధారణంగా కేబినెట్ సమావేశాలు సమయం ప్రకారం జరిగిపోతున్నాయి. కానీ తాజాగా వాయిదాల పర్వం ఎక్కువవుతోంది.
గత నెల 25వ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహణకు రంగం సిద్ధమైంది. రేపు మంత్రివర్గ భేటీ అనగా.. ముందురోజు అర్ధాంతరంగా దీన్ని అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం జగన్కు ఢిల్లీ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్షా పిలుపు రావడంతో హస్తిన వెళ్లాల్సి వచ్చింది. దీంతో కేబినెట్ వాయిదా పడింది. కానీ ఆ తర్వాత అక్టోబర్ 1న అయినా కేబినెట్ భేటీ ఉందని భావించినా అది కూడా సాధ్యం కాలేదు. ఈసారి కారణాలు కూడా తెలియలేదు. జగన్ మామ ఈసీ గంగిరెడ్డి హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటం, ఆయన పరిస్ధితి విషమంగా ఉండటంతో ఏ క్షణమైనా వెళ్లాల్సి రావొచ్చన్న కారణంతో జగన్ కేబినెట్ వాయిదా వేశారని భావించారు.
Recommended Video
తిరిగి అక్టోబర్ 8న కేబినెట్ భేటీ జరగాల్సి ఉంది. కానీ వరుసగా మూడోసారి కూడా మంత్రివర్గ సమావేశం వాయిదా పడిపోయింది. ఈసారి కూడా బయటికి కారణాలు చెప్పకపోయినా సీఎం జగన్ జగనన్న విద్యాదీవెన కార్యక్రమాన్ని ఆ రోజు ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో ఈ భారీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కేబినెట్ భేటీని చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. విభజన తర్వాత ఏర్పడిన రాష్ట్రంలో వరుసగా మూడుసార్లు కేబినెట్ వాయిదా పడటం ఇదే తొలిసారి. గతంలో ఉమ్మడి ఏపీలోనూ ఇలా వరుసగా మూడుసార్లు కేబినెట్ భేటీ వాయిదా పడిన సందర్భాలు లేవని చెప్తున్నారు.