ఏపీ పంచాయతీ ఎన్నికలు: వాయిదా వేయాలని ఎస్ఈసీకి సర్కార్ వినతి..? వరసగా భేటీలు
స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్కు ఏపీ సర్కార్ విజ్ఞప్తి చేయనుంది. స్థానిక ఎన్నికలపై దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్, ఉద్యోగ సంఘాలు హౌస్ మోషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్ను సోమవారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు పేర్కొంది. సోమవారం వరకు ఎన్నికల నోటిఫికేషన్ను వాయిదా వేయాలని, సుప్రీంకోర్టులో సోమవారం స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణకు రానుందని అందువల్ల ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం కోరనుంది.
Recommended Video
రేపే నోటిఫికేషన్..?
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ను సీఎస్ ఆదిత్యనాథ్, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కలవనున్నారు. సీఎస్ క్యాంప్ కార్యాలయానికి సీఎం కార్యాలయం అధికారులు చేరుకున్నారు. పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ జోరు పెంచారు. శనివారం ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. పంచాయతీ ఎన్నికలకు పడిన అడ్డంకి తొలగిపోయింది. వచ్చే నెలలో నాలుగు విడతల్లో పోలింగ్ నిర్వహించాలనే రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. ఎన్నికల షెడ్యూలును రద్దుచేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్తో కూడిన ధర్మాసనం పక్కనపెట్టింది.
4 విడతల్లో ఎన్నికలు..
వచ్చే నెల 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గురువారం సంచలన తీర్పు చెప్పింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం 4 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపారు. వచ్చే నెల 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని.. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులో ఉందని స్పష్టం చేశారు.
ఇదీ వివాదం..
ఏపీలో ఎస్ఈసీ వర్సెస్ సర్కార్ వార్ జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా గత ఏడాది ఎన్నికలకు నిమ్మగడ్డ వాయిదా వేయడంతో వివాదం చెలరేగింది. ఆయనను తప్పించడం.. కొత్త ఎస్ఈసీ నియమించడం కూడా జరిగిపోయింది. అయితే హైకోర్టు జోక్యంతో.. తిరిగి నిమ్మగడ్డ పదవీ చేపట్టారు. మార్చిలో ఆయన పదవీకాలం ముగియనుంది. అప్పటివరకు ఎన్నికలు నిర్వహించొద్దు అని జగన్ సర్కార్ భీష్మించుకొని కూర్చొంది. కానీ ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ పట్టుబడుతున్నారు. దీంతో వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది.