ఉపాధ్యాయుల కోసం లోగో ఆమోదించిన ఎపి ప్రభుత్వం...శాంసంగ్ చే స్మార్ట్ క్లాసుల నిర్వహణ
అమరావతి:ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక లోగోను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. డిసెంబరు 1 తేదీ నుంచి ఈ లోగో అమల్లోకి రానున్నట్లు తెలిసింది.
తద్వారా న్యాయవాదులు, వైద్యుల తరహాలో ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా ఈ లోగోను తమ లెటర్ హెడ్లపై, వాహనాలపై వినియోగించుకోవచ్చునని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం(టీఎన్యూఎస్) తెలిపింది. టీఎన్యూఎస్ తరుపున విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆ యూనియన్ ప్రతినిథులు ఆర్.రాంబాబు, పీవీఎస్ వర్మ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఉపాధ్యాయుల కోసం గతంలో తాము ఒక లోగో రూపొందించినప్పటికీ దానికి ప్రభుత్వ ఆమోదం లభించలేదని, అయితే ప్రస్తుతం రూపొందించిన లోగోకు ప్రభుత్వం తన అంగీకారం తెలియజేసిందని టీఎన్యూఎస్ ప్రతినిధులు తెలిపారు. తమ ప్రయత్నాన్ని గుర్తించి ఉపాధ్యాయులకు సముచిత గౌరవాన్ని కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యాశాఖకు కృతజ్జతలు తెలుపుతున్నామని వారు పేర్కొన్నారు.
మరోవైపు ఎపి ప్రభుత్వం తలపెట్టిన 'టీచర్స్ టీచింగ్ ఫర్ టెక్నాలజీ' కార్యక్రమంలో భాగంగా ఏపీలోని 14 కాలేజీల్లో కొరియాకు చెందిన శాంసంగ్ కంపెనీ స్మార్ట్ క్లాస్లు నిర్వహించనున్నట్లు తెలిసింది. ఎపి విద్యాశాఖ పర్యవేక్షణలో జరగనున్న ఈ స్మార్ట్ క్లాస్ ల శిక్షణ ద్వారా ఔత్సాహిక అభ్యర్థులకు బీఎడ్, డీఎడ్ డిగ్రీలను అందించనున్నట్లు సమాచారం. 200 గంటలపాటు ఈ కోర్సులు అందించనున్నట్లు తెలిసింది.
ఈ కోర్సుల ద్వారా అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో స్మార్ట్ క్లాస్ రూమ్ ల ద్వారా శిక్షణ ఇచ్చే పాఠశాలలకు ఈ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉపయోగపడతారు. అలాగే ముందు ముందు బోధనా వ్యవస్థ అధునాతన డిజిటల్ మాధ్యమాల్లో సాగనున్నందున అలాంటి విద్యను అందించేందుకు ఈ కోర్సు చేసిన అభ్యర్థులు అవసరం. విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ ఈ కోర్సు వివరాలతో కూడిన ఒక ప్రకటనను సోమవారం విడుదల చేశారు. యునెస్కో-ఎంజీఐఈపీల భాగస్వామ్య ఒప్పందంలో భాగంగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.