ఏపీ హైకోర్టు తీర్పులపై సోషల్ పోస్టుల కుట్ర- తెరపైకి పీకే టీమ్- సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్
ఏపీలో న్యాయవ్యవస్ధ ఇస్తున్న తీర్పులపై సోషల్ మీడియా వార్ పెరుగుతోంది. ఇప్పటికే హైకోర్టు ఈ వ్యవహారంపై సీరియస్గా స్పందిస్తున్నా పోస్టులు మాత్రం ఆగడం లేదు. కోర్టులపై అనుచితంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఏపీ సీఐడీని గతంలోనే ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో సీఐడీ కేసులు పెట్టినా అవి మొక్కుబడిగానే ఉన్నాయని, అన్నీ బెయిలబుల్ కేసులేనంటూ మరో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంలో భారీ కుట్ర దాగుందని, దాన్ని ఛేదించాలంటే సీబీఐ దర్యాప్తు చేయించాలని కర్నూలుకు చెందిన మాజీ పోలీసు అధికారి శివానందరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కలకలం రేపుతోంది.
ఏపీ మూడు రాజధానులపై నేటి నుంచి హైకోర్టు విచారణ- ఇక ప్రతి రోజూ వాదోపవాదాలు...
సోషల్ పోస్టులపై మరో పిటిషన్..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలువడిన పలు తీర్పులను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో కొందరు పెడుతున్న పోస్టుల వెనుక కుట్ర దాగుందని ఆరోపిస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానంలో ఓ పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే దాఖలైన కేసుల్లో తనను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని కోరుతూ కర్నూలు జిల్లాకు చెందిన మాజీ పోలీసు అధికారి శివానందరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఆయన ప్రస్తావించిన పలు అంశాలు ఇప్పుడు వైసీపీ సర్కారుకు ముచ్చెమటలు పట్టించేలా ఉన్నాయి. రాష్ట్రంలోనూ తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.
హైకోర్టుకు సహకరించని సీఐడీ...
న్యాయవ్యవస్ధకు వ్యతిరేకంగా పెడుతున్న సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో దర్యాప్తు సంస్ధలు కోర్టు విచారణకు సరిగా సహకరించడం లేదని శివానందరెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. న్యాయమూర్తులపై సోషల్ మీడియా పోస్టుల అంశంలో హైకోర్టు 98 మందిని గుర్తించి నోటీసులు ఇచ్చినా సీఐడీ మాత్రం 18 మందినే గుర్తించి బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిందని గుర్తుచేశారు. ఇంతవరకూ ఎవరినీ అరెస్టు కూడా చేయలేదన్నారు. దీంతో కార్యనిర్వాహక వ్యవస్ధ, దర్యాప్తు సంస్ధలు నిందితుల్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ఈ కేసులో కోర్టు విచారణకు సహకారం అందించేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. రాజ్యాంగ విధులు నిర్వర్తించే హైకోర్టుకు ఆటంకాలు కల్పించడం దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. రాజకీయ పార్టీల సోషల్ మీడియా వింగ్లు చట్ట విరుద్ధ చర్యలతో హైకోర్టు ప్రతిష్టను దిగజారుస్తున్నాయన్నారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు చేసినా దర్యాప్తు సంస్ధలు లెక్కలేకుండా వ్యవహరిస్తున్నాయని పిటిషనర్ శివానందరెడ్డి ఆరోపించారు. రాజకీయ అధిపతులు చెప్పినట్లుగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయన్నారు.
వైసీపీ సోషల్ మీడియా వింగ్ పనే- సాక్షాలివే...
ఏపీలో అధికార వైసీపీ హైకోర్టుకు విరుద్ధంగా ఎళాంటి కుట్ర పన్నుతుందో సాక్షాలను కోర్టు ముందు ఉంచేందుకు అనుమతించాలని పిటిషనర్ శివానందరెడ్డి కోరారు. ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ టీమ్కు కోట్ల రూపాయలు చెల్లించి వైసీపీ నియమించుకుందని, ఈ టీమ్లోని ఐటీ నిపుణులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేదికగా తమ వ్యతిరేకులపై ప్రజల్లో ద్వేషం కలిగించడంలో సిద్ధ హస్తులని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. స్లీపర్ షెల్స్ తరహాలో వీరు వ్యవహరిస్తూ రాష్ట్రంలో ప్రతీ పౌరుడి వ్యక్తిగత సమాచారం సోషల్ మీడియా ద్వారా సేకరించి కులం, మతం, రాజకీయ అభిరుచులు, తటస్ధుల వారీగా వర్గీకరించారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ విధంగా ఓటర్లను తమవైపు తిప్పుకోవడం సహా, అనుకూలంగా లేని వారిని లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు.
Recommended Video
సోషల్ పోస్టులపై సీబీఐ దర్యాప్తు...
ప్రశాంత్ కిషోర్ టీమ్ సభ్యులు వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా ప్రభుత్వ ఆలోచనల్ని ప్రజల్లోకి వ్యాపింపజేస్తూ స్లీపర్ షెల్ల తరహాలో వ్యవహరిస్తున్నారని పిటిషనర్ శివానందరెడ్డి ఆరోపించారు. తద్వారా ఆదాయం కూడా పొందుతున్నారన్నారు. హైకోర్టు జడ్డీలను అపకీర్తి పాలుచేయడం, వారిని న్యాయపాలనకు దూరం చేయాలనేది వైసీపీ వ్యూహంలో భాగమేనన్నారు. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గుర్రంపాటి దేవేందర్రెడ్డిని సమాచార, పౌరసంబంధాలశాఖ ఛీఫ్ డిజిటల్ డైరెక్టర్గా నియమించారని, ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ టీమ్ సహాయకులుగా వ్యవహరించిన బ్రహ్మానందపాత్ర, సీవీ రెడ్డిని డిజిటల్ డైరెక్టర్లుగా నియమించారని పిటిషన్లో పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్రచారంలో వీరు కీలక వ్యక్తులన్నారు. పోలీసులు సైతం ప్రజలందరినీ ఒకేలా చూడకుండా రాజకీయ ప్రత్యర్ధులను భయభ్రాంతులను చేస్తూ తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ చర్యలన్నీ రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు గతంలోనే చెప్పిందన్నారు. అందుకే కోర్టు నిర్ణయాలు సహించలేక సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక స్పష్టమైన కుట్ర దాగుందన్న శివానంద రెడ్డి... దర్యాప్తును సీబీఐకి అప్పగించడం ద్వారా చేధించాలని కోరారు.