మే 14న ఏపీ 10వ తరగతి ఫలితాలు విడుదల
అమరావతి: ఈ నెలలో వరుసగా పరీక్ష ఫలితాలు విడుదల అవుతున్నాయి. సోమవారం రోజున తెలంగాణ పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి ఫలితాలు కూడా మే 14వ తేదీన విడుదల చేయనుంది ఆ రాష్ట్ర విద్యాశాఖ. ఇక విద్యార్థుల జవాబు ప్రతాల మూల్యాంకన ప్రక్రియ ఎప్పుడో ముగిసింది. కానీ ఆయా స్కూళ్లు తమ విద్యార్థులకు సంబంధించి ఇంటర్నల్ మార్కులు ఏపీ బోర్డుకు సకాలంలో పంపకపోవడంతో ఫలితాల విడుదలలో జాప్యం జరిగింది.
విద్యార్థుల ఇంటర్నల్ మార్కులు అధికారులకు అందడంతో ఇక ఆ మార్కులను కూడా అప్లోడ్ చేశారు. ఇప్పటికైతే అన్ని పనులు పూర్తి చేసింది ఏపీ బోర్డు. ఇక ఫలితాల ప్రకటనే మిగిలింది. ఈ ఏడాది పదవ పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 3వరకు జరిగాయి. పరీక్షలకు మొత్తం 6.2 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక పరీక్షా ఫలితాలను విద్యార్థులు ఆర్టీజీఎస్ పోర్టల్ (www.rtgs.ap.gov.in) ఏపీ ఫైబర్ టీవీ, కైజల్ మొబైల్ యాప్, పీపుల్ ఫస్ట్ మొబైల్ యాప్ ద్వారా ఫలితాలు చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే సోమవారం రోజున తెలంగాణలో పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ కమిషనర్ జనార్ధన్ రెడ్డి ఫలితాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా మొదటిస్థానంలో నిలవగా.. హైదరాబాద్ జిల్లా ఆఖరి స్థానానికి పరిమితమైంది. ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. మొత్తం విద్యార్థుల ఉత్తీర్ణత చూసినట్లయితే 92.43 శాతంగా నమోదైంది.99.73 శాతం ఉత్తీర్ణతతో జగిత్యాల జిల్లా విద్యార్థులు మొదటిస్థానం సాధించారు. 83.09 శాతంతో హైదరాబాద్ జిల్లా విద్యార్థులు చివరిస్థానంలో నిలిచారు. మొత్తంగా చూసినట్లయితే బాలురు 91.18 శాతం.. బాలికలు 93.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక ఏపీ విద్యార్థులు ఏ స్థాయిలో మార్కులు సాధిస్తారో తెలియాలంటే మంగళవారం వరకు వేచిచూడాల్సిందే.