సీఎం జగన్ కీలక నిర్ణయం: 50 శాతం నిర్మాణం పూర్తయిన అసెంబ్లీ భవనాలకు నిధులు
మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతికి సంబంధించి ఇప్పటికే 50 శాతం నిర్మాణం పూర్తయి.. పెండింగ్లో ఉన్న భవనాలను పూర్తి చేయడానికి ఏఎం, ఆర్డీయేకు రూ. 3 వేల కోట్లకు బ్యాంక్ గ్యారంటీ ప్రభుత్వం ఇచ్చే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. ఇప్పటికీ ప్రారంభం కానీ, కొద్దిగా ప్రారంభమైన భవనాల నిర్మాణాలపై ఇంజనీరింగ్ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకోవాలని కేబినెట్లో అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలుస్తోంది.
సచివాలయం మొదటి బ్లాక్ సమావేశ మందిరంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, మంత్రులు కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
హైకోర్టులో రాజధాని నిర్మాణం వ్యవహారాలపై విచారణ షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో నిర్ణయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. నవరత్నాలు అమలు క్యాలెండర్కు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఇదివరకు తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే ఏప్రిల్ నుంచి జనవరి వరకు పథకాల అమలుకు ఆమోదించింది. 5.8 కోట్ల మంది లబ్ధిదారులకు అందించే పథకాల క్యాలెండర్కు ఆమోదం తెలిపింది.
ఈబీసీ నేస్తం పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈబీసీ మహిళలకు మూడేళ్లలో రూ.45 వేల ఆర్ధిక సాయం 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు మహిళలకు పథకం వర్తింపును ఆమోదించింది. పట్టణ ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను 300 చదరపు అడుగుల లోపు ఉంటే.. రూపాయికే లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.