లోకల్ వార్: ఎస్ఈసీకి సీఎస్ లేఖ, వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాతే..
ఏపీలో స్థానిక ఎన్నికలకు సంబంధించి హీట్ కొనసాగుతూనే ఉంది. హైకోర్టు సూచనల మేరకు ఎస్ఈసీతో సీఎస్, ఇతరులు సమావేశమయ్యారు. ఎన్నికల నిర్వహణకు సరైన సమయం కాదని చెప్పినా.. రాత్రి ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల చేశారు. అంతకుముందు సీఎస్కు లేఖ కూడా రాయగా.. ఆదిత్యనాథ్ దాస్ స్పందించారు. రిప్లై లెటర్ రాశారు.
Recommended Video
ఎస్ఈసీతో సమావేశం కన్నా ముందే సీఎస్ తన లేఖను ఎన్నికల సంఘానికి పంపించారు. కరోనా వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాతే ఎన్నికల నిర్వహణ సాధ్యం అని స్పష్టంచేశారు. ప్రస్తుతం టీకా అందజేసే ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఉన్నారని పేర్కొన్నారు. ఈ సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని సీఎస్ స్పష్టంచేశారు. అయితే ప్రభుత్వం కావాలనే ఎన్నికలను వాయిదా వేస్తుందనే ఆరోపణలను కొట్టిపారేశారు. కరోనా వల్లే ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాలేదని సీఎస్ స్పష్టంచేశారు. అధికారిక సంప్రదింపుల్లో రాజ్యాంగేతర పదవుల్లో ఉన్నవారిని ప్రస్తావించడం సరికాదని హితవు పలికారు.
ప్రజల ప్రాణాలు ఫణంగా పెడుతూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారని పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి జీకే ద్వివేది మండిపడ్డారు. ఇది సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘన కిందకు వస్తుందని చెప్పారు. తాము ఇప్పుడు కరోనా టీకా ప్రక్రియలో ఉన్నామని చెప్పినా.. ఎస్ఈసీ మొండిగా వెళ్లారని దుయ్యబట్టారు. గతేడాది మార్చి 15వ తేదీన ఒక కరోనా కేసున్నా ఏకపక్షంగా ఎన్నికలను వాయిదా వేశారని తెలిపారు. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా వాయిదా నిర్ణయం తీసుకున్నారు. మరీ ఇప్పుడు కరోనా విజృంభిస్తోన్న సమయంలో ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు.
ఇటు ఎన్నికల కమిషన్ ప్రొసీడింగ్స్పై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. కరోనా వ్యాక్సినేషన్ సన్నద్ధతలో అధికార యంత్రాంగం ఉన్న తరుణంలో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని జగన్ సర్కారు వ్యతిరేకిస్తోంది. మరోవైపు జనవరి 23 నుంచి ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. నాలుగు దశలుగా ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 23న తొలి దశ ఎన్నిలకు, ఈ నెల 27న రెండో దశ ఎన్నికలకు, ఈ నెల 31న మూడో దశ ఎన్నికలకు, ఫిబ్రవరి 4న నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 5న తొలి దశ పంచాయతీ ఎన్నికలు, ఫిబ్రవరి 9న రెండో దశ పంచాయతీ ఎన్నికలు, ఫిబ్రవరి 13న మూడో దశ పంచాయతీ ఎన్నికలు, ఫిబ్రవరి 17న నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో శనివారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.