ఏఎన్ఎంలు టెన్షన్ పడొద్దు.. ఉద్యోగ భద్రతపై అనుమానాలు వద్దు : ఆళ్ల నాని వివరణ
అమరావతి : ఉద్యోగ భద్రత విషయంలో గ్రామీణ స్థాయి మహిళా నర్స్ వర్కర్లు టెన్షన్ పడొద్దని సూచించారు డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. ఉద్యోగాలు పోతాయని.. ఏఎన్ఎం వ్యవస్థ ఉండబోదని జరుగుతున్న ప్రచారాలను నమ్మొద్దని కోరారు. ఏఎన్ఎంల ఉద్యోగ భద్రతకు సంబంధించి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని స్పష్టం చేశారు నాని. తప్పుడు వదంతులు, ప్రచారాలను ఎట్టిపరిస్థితుల్లో నమ్మొద్దని సూచించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కాకముందే ఇలాంటి విషపూరిత ప్రచారారాలతో జనాలను మభ్యపెట్టాలని కొందరు చూడటం అవివేకమని అన్నారు. ఇలా ఇంకెన్నాళ్లు మభ్యపెడతారని ప్రశ్నించారు.
ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్న ఏఎన్ఎంల పరిస్థితి దృష్ట్యా.. సీఎం జగన్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు నాని. అసలు ఏఎన్ఎంలను ఉద్యోగాల నుంచి తొలగిస్తారనే ప్రచారం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో కనిపెట్టాలని ఆదేశించారు. ఈ అంశంపై సీరియస్గా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి తనకు సూచించడంతో అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.
శివాజీకి
హైకోర్టులో
ఊరట..
అమెరికా
వెళ్లడానికి
గ్రీన్
సిగ్నల్..!
ఎవరో చెప్పింది నమ్మొద్దని ఏఎన్ఎంలకు సూచించారు నాని. ఉద్యోగ భద్రతపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని తెలిపారు. రాష్ట్రంలో 7 వేల 418 మంది ఏఎన్ఎంలు పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. అందులో మూడు రకాలుగా కాంట్రాక్ట్, సెకండ్ ఏఎన్ఎం, ఈసీ ఏఎన్ఎం తదితర కేటగిరీల్లో ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల్లో భాగంగా 13 వేల 540 మంది ఏఎన్ఎంలను నియమించనున్నట్లు తెలిపారు. ఈ పోస్టుల భర్తీ కోసం మూడు కేటగిరీల్లో ఇప్పటికే పనిచేస్తున్న ఏఎన్ఎంలు కూడా దరఖాస్తు చేసుకొని పరీక్షలకు రాయొచ్చని వెల్లడించారు.
కొత్తగా భర్తీ చేయబోయే ఏఎన్ఎంల పోస్టుల్లో ఇదివరకే డ్యూటీలు చేస్తున్నవారికి 10 శాతం వెయిటేజీ కూడా ఇస్తామని ప్రకటించారు. ఒకవేళ పరీక్ష రాసి సెలెక్ట్ కాకున్నా.. వారిని ఇదివరకున్న పోస్టుల్లో అలాగే కంటిన్యూ చేస్తామని తెలిపారు. సచివాలయ పోస్టులకు ఎంపికయ్యే ఏఎన్ఎంలకు వేతన విషయంలో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని.. ఎలాంటి ఆందోళన అక్కర్లేదని స్పష్టం చేశారు.