ఏపీలో సీపీఎస్ రద్దు ఉద్యమం తీవ్రతరం- జగన్ మాట నిలబెట్టుకోవాలంటూ నిరసనలు...
ఏపీలో వైసీపీ ఎన్నికల హామీ మేరకు సీపీఎస్ విధానం రద్దు చేయాలని కోరుతూ ఎన్జీవోల సంఘం ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజు నిరనసలు చేపట్టింది. ఎన్జీవోల సంఘం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు భారీ సంఖ్యలో జిల్లాల్లోని తమ కార్యాలయాల్లో నిరసనలు తెలిపారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి దాని స్ధానంలో పాత పింఛన్ విధానం అమలు చేయాలన్న ఉద్యోగుల పోరాటాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలని వారు డిమాండ్ చేశారు.
విజయవాడ బందరు రోడ్డులోని పంచాయతీరాజ్శాఖ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన నిరసనల్లో ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డితో పాటు కార్యదర్శి బండి శ్రీనివాసరావు, జిల్లా అద్యక్షుడు విద్యాసాగర్, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే సీపీఎస్ రద్దుపై కమిటీ వేసినా ఇప్పటివరకూ కమిటీ నివేదిక ఇవ్వకపోవడం బాధాకరమని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం జగన్ గతంలో పాదయాత్ర సందర్భంగా సీపీఎస్ రద్దుపై కమిటీలతో కాలయాపన చేయబోనని, అధికారంలోకి రాగానే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. కానీ అధికారం చేపట్టి పద్నాలుగు నెలలు గడుస్తున్నా ఇంకా సీపీఎస్ విధానం రద్దు కాకపోవడంతో ఉద్యోగుల కుటుంబాలు మనో వేదనకు గురవుతున్నాయని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో అత్యధిక శాతం ఉద్యోగులు సీపీఎస్ విధానంలోనే ఉన్నప్పటికీ దాని రద్దు కోసం ప్రభుత్వం గత హామీ మేరకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఏపీ ఎన్జీవోల సంఘం కార్యదర్శి బండి శ్రీనివాసరావు తెలిపారు. సీపీఎస్ రద్దు చేసి పాత విధానం అమలు చేసే వరకూ ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమేనని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ తీరు వల్ల రాష్ట్రంలోని లక్షా ఎనభై ఐదు వేల మంది ఉద్యోగుల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని కృష్ణా జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ తెలిపారు. కొత్త పింఛన్ విధానంతో వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందన్నారు. రానున్న కాలంలో వీరి సేవలు ప్రభుత్వానికి ఎంతో అవసరమని, ఈ తరుణంలో వారిలో మనోధైర్యాన్ని నింపడానికి సీపీఎస్ రద్దు ఒకటే మార్గమని విద్యాసాగర్ తెలిపారు.