ప్రజా వేదికే కాదు.. చంద్రబాబు ఇల్లు కూడా ఆయనకు దక్కదా..? వైసీపీ నేతల కామెంట్స్ మర్మం అదేనా..!
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. న్యూటన్ థర్డ్ లా అనుసరిస్తూ.. చర్యకు ప్రతిచర్య చేపట్టేలా రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది తాజా వ్యవహారం. టీడీపీ ప్రభుత్వంలో తమను ఇరకాటంలో పెట్టారనే కారణంతో.. ఇప్పుడు అందివచ్చిన అధికారంతో ఆ పార్టీని ఇబ్బంది పెట్టే ఆలోచనగా వైసీపీ తీరు కనిపిస్తోందనే ఆరోపణలు లేకపోలేదు.
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడుకు జగన్ సర్కార్ గట్టి ఝలక్ ఇచ్చింది. టీడీపీ హయాంలో నిర్మించిన ప్రజావేదిక తమకు కేటాయించాలంటూ చంద్రబాబు రాసిన లేఖను సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి తిరస్కరించడం చర్చానీయాంశమైంది. అంతేకాదు ఉండవల్లిలోని ప్రజావేదికను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడం టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అదలావుంటే చంద్రబాబు ఇల్లు కూడా అక్రమ కట్టడమేనంటూ మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది.
అడవిబిడ్డ సాహస యాత్ర.. అనంతపురం చిన్నికృష్ఱుడి అపూర్వ విజయాలు
ప్రజావేదిక ఘట్టం ముగిసింది.. ఇక చంద్రబాబు నివాసమేనా?
ఆంధ్రప్రదేశ్లొ అధికార, ప్రతిపక్షం మధ్య వార్ వాతావరణం కనిపిస్తోంది. ఉండవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం పక్కన నిర్మించిన ప్రజావేదికను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడం టీడీపీ, వైసీపీ మధ్య వైరం మరింత ముదిరింది. అయితే చంద్రబాబు నివాసం కూడా అక్రమ కట్టడమేనంటూ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి.
ప్రజావేదికను ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే స్వాధీనం చేసుకున్నప్పటికీ.. చంద్రబాబు నివాసంపై ఏం చేయాలనేదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని వ్యాఖ్యానించారు బొత్స. అదలావుంటే సోమవారం (24.06.2019) నాడు తలపెట్టిన కలెక్టర్ల సదస్సు ప్రజావేదిక భవనంలోనే నిర్వహిస్తుండటం గమనార్హం. అయితే ఈ అంశంపై బొత్స మాట్లాడుతూ.. ప్రజావేదిక ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా కట్టిందే అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో కలెక్లర్ల సదస్సు అక్కడే నిర్వహించాల్సి వస్తోందని వివరించారు.
అనుమతులు లేవు.. అడ్డగోలు నిర్మాణాలు.. బొత్స కామెంట్స్
ప్రజావేదిక నిర్మాణంలో లెక్కకు మించి అవకతవకలు జరిగాయని చెప్పుకొచ్చారు బొత్స. దాని నిర్మాణానికి సంబంధించి సీఆర్డీఏ నుంచి నివేదిక తెప్పించుకున్నట్లు తెలిపారు. ప్రజావేదిక నిర్మాణానికి కనీసం టౌన్ ప్లానింగ్ విభాగం అనుమతి కూడా లేకపోవడం దారుణమన్నారు. అంతేకాదు ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా ప్రజావేదిక నిర్మాణం జరిగిందని ఆరోపించారు.
టీడీపీ హయాంలో అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణ మౌఖిక ఆదేశాలతో 5 కోట్ల రూపాయల అంచనాలను అమాంతం 8 కోట్ల 90 లక్షలకు పెంచారని ధ్వజమెత్తారు. ఆ క్రమంలో 7 కోట్ల 59 లక్షలు వెచ్చించి ఆ మేరకు బిల్లులు కూడా చెల్లించారు. అయితే ఈ తతంగమంతా ప్రజాస్వామ్యబద్దంగా జరగలేదంటున్నారు బొత్స.
టీడీపీ హయాంలో ప్రజాధనం దుర్వినియోగం : బొత్స
నోటి మాటలతో అంచనాలు పెంచుతూ టీడీపీ నేతలు ప్రజాధనం దుర్వినియోగం చేశారని మండిపడ్డారు బొత్స. ఇప్పుడు వారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే.. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజావేదికను తమకు అప్పగించాలంటూ చంద్రబాబు లేఖ రాయడం హాస్యాస్పదమన్నారు. అది ఆయన సొమ్ముతో నిర్మించిందా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను సొంత అవసరాలకు కేటాయిస్తారా అంటూ మండిపడ్డారు.
పేరుకే ప్రభుత్వ ఉద్యోగం.. ట్రైనింగ్ మరిచారు, జీతాల్లేవు.. ఆ పోస్టుతో తిప్పలెన్నో..!
అధికార యంత్రాంగంపై టీడీపీ నేతల రాద్ధాంతం ఎందుకో : బొత్స
ప్రజావేదిక విషయంలో ప్రభుత్వ యంత్రాంగం తన పని తాను చేసుకుంటూ వెళితే టీడీపీ నేతలు ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు బొత్స. టీడీపీ హయాంలో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి గౌరవం, సదుపాయాలు దక్కాయో.. ఇప్పుడు చంద్రబాబుకు కూడా అదే రీతిలో ఉంటాయన్నారు. ప్రజావేదికను అడ్డం పెట్టుకుని అధికారులతో టీడీపీ నేతలు గొడవపడటం సరికాదన్నారు. అధికారులపై దాడులు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు.
అదలావుంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే నడుచుకుంటున్నామని అంటున్నారు ప్రభుత్వాధికారులు. ప్రజావేదిక భవనం నుంచి ఎలాంటి వస్తువులు బయటపడలేదని చెబుతున్నారు. మొత్తానికి ప్రజావేదిక ప్రభుత్వపరం కానుండటంతో మరి చంద్రబాబు నివాసంపై బొత్స చేసిన తాజా వ్యాఖ్యలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో చూడాలి.