జగన్కో న్యాయం- కోర్టులకో న్యాయం- హైకోర్టు విచారణతో తెరపైకి ఏపీ సీఐడీ పనితీరు..
ఏపీలో గతేడాది అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో విపక్షాలు, వారికి సానుభూతిపరులుగా ఉన్న కొందరు పోస్టులు పెట్టారు. దీనిపై స్పందించిన ఏపీ సీఐడీ ముసలీ ముతకా అని కూడా చూడకుండా వారిపై కేసులు నమోదు చేయడమే కాదు విచారణ పేరుతో తమ కార్యాలయాల చుట్టూ తిప్పించింది. ప్రభుత్వోద్యోగులకు సైతం నోటీసులు ఇచ్చింది. వీరిలో కొందరిపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకున్నారు. కానీ ప్రస్తుతం ఏపీ హైకోర్టు తీర్పులను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై సీఐడీ అదే దూకుడు చూపలేకపోతోంది. ఎందుకంటే ఈ పోస్టులు పెడుతున్న వారంతా వైసీపీ నేతలు, కార్యకర్తలు, అధికార పార్టీ సానుభూతిపరులే. వీరిపై చర్యలు తీసుకుంటే ఓ సమస్య, తీసుకోకపోతే మరో సమస్య అన్నట్లుగా సీఐడీ పరిస్ధితి మారింది.
32 లక్షల ఇళ్లకు మంచినీరు, రూ.4800 కోట్ల వ్యయం.. వైసీపీ ఎంపీ విజయసాయి..
జగన్ని తిడితే కేసులు...
వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలు ప్రజావ్యతిరేకంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన టీడీపీ కార్యకర్తలు, ప్రభుత్వోద్యోగులు, చివరికి ఇళ్లలో ఉన్న ముసలీ ముతకా జనంపైనా సీఐడీ కేసులు పెట్టింది. సోషల్ పోస్టుల వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగులను సైతం సీఐడీ వదలిపెట్టలేదు. ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదై దర్యాప్తు వివిధ దశల్లో ఉంది. వీరిలో చాలా మంది పార్టీలతో సంబంధం లేకుండా కేవలం ప్రభుత్వ నిర్ణయాలను సోషల్ మీడియాలో ప్రశ్నించిన సందర్భాలూ ఉన్నాయి. అయినా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారనో, ఎవరో చేసిన విమర్శలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారనే కారణంతోనో సీఐడీ కేసులు నమోదు చేసింది. గుంటూరుకు చెందిన రంగనాయకమ్మ అనే వృద్ధురాలి కేసు ఈ కోవలోనిదే.
హైకోర్టు తీర్పులపై పెట్టిన పోస్టులపై
వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలను కొట్టివేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాలను తప్పుబడుతూ సోషల్ మీడియాలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులు పలు పోస్టులు పెట్టారు. ఇందులో న్యాయవ్యవస్ధను కించపరిచే వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. వీటిపై లక్ష్మీనారాయణ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ తర్వాత హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సైతం న్యాయవ్యవస్ధ పరువు పోతోందంటూ ఫిర్యాదు చేశారు. వీటిపై హైకోర్టు విచారణ చేపట్టింది. బాధ్యులైన 98 మందికి నోటీసులు జారీ చేసింది. వీరిపై దర్యాప్తు చేయాలని సీఐడీని ఆదేశించింది. కానీ సీఐడీ ఇందులో 18 మందిపైనే కేవలం నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి చేతులు దులుపుకుందని తాజాగా కర్నూలుకు చెందిన శివానందరెడ్డి అనే మాజీ పోలీసు అధికారి హైకోర్టులో పిల్ వేశారు.
సీఐడీ తీరుపై హైకోర్టు అసంతృప్తి...
ఏపీలో న్యాయవ్యవస్ధకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జనం పోస్టులు పెడుతుంటే సీఐడీ వారిపై కేసులు నమోదు చేయకుండా, చర్యలు తీసుకోకుండా ఏం చేస్తోందని విచారణ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. చర్యలు పేపర్లపై కాదని చేతల్లో చూపించాలని సూచించింది. కనీసం సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు తొలగించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టుపై గౌరవం ఉంటే ఇప్పటికైనా వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. అదే సమయంలో తమ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను కాపాడుకుంటామంటూ ఓ ప్రముఖ నాయకుడు బహిరంగంగానే చెబుతున్నారని హైకోర్టు రిజిస్ట్రార్ కూడా తన అనుబంధ పిటిషన్లో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో రాజకీయ నేతలు, కార్యకర్తలు కోర్టులకు సవాళ్లు విసురుతుంటే సీఐడీ మాత్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తోందని రిజిస్ట్రార్ జనరల్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో సీఐడీ పనితీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది.