మూడు రాజధానులపై స్టేటస్ కో మళ్లీ పొడిగింపు: ఏపీ హైకోర్టు: ఎప్పటివరకంటే: సుదీర్ఘ జాప్యం?
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్పై తలెత్తిన న్యాయపరమైన చిక్కుముడులు ఇప్పట్లో వీడేలా కనిపించట్లేదు. గవర్నర్ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్పై విధించిన స్టేటస్ను ఏపీ హైకోర్టు పొడిగించింది.
Recommended Video
వచ్చేనెల 21వ తేదీ వరకు స్టేటస్ కో పొడిగించినట్లు వెల్లడించింది. స్టేటస్ కోను ఏపీ హైకోర్టు వాయిదా వేయడం ఇది రెండోసారి. ఈ నెల 14వ తేదీన తొలిసారిగా దీన్ని వాయిదా వేసింది. స్టేటస్ కో గడువు గురువారం నాటికి ముగియాల్సి ఉంది. దీనికి సంబంధించిన పిటీషన్ ఏపీ హైకోర్టు సమక్షానికి విచారణకు వచ్చింది. విచారణ అనంతరం దీన్ని వచ్చేనెల 21వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఏపీ హైకోర్టు వెల్లడించింది. స్టేటస్ కోను ఎత్తేయాలంటూ ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఙప్తిని హైకోర్టు తిరస్కరించింది.
గవర్నర్ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్పై మరింత విస్తృతంగా విచారణ చేపట్టాల్సిన ఉందనే కారణంతోనే ఏపీ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్పై అమరావతి పరిరక్షణ సమతి ప్రతినిధులు హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఉద్దేశపూరకంగా తమను అన్యాయం చేస్తోందంటూ అమరావతి ప్రాంత రైతుల తరఫున పరిరక్షణ సమితి ప్రతినిధులు ఈ పిటీషన్లను దాఖలు చేశారు.
గవర్నర్ గెజిట్ జారీ చేయడంతో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి మార్గం సుగమమైందని భావించినప్పటికీ.. అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు ఏపీ హైకోర్టులో పిటీషన్లను దాఖలు చేయడంతో మళ్లీ మొదటికి వచ్చింది. వాటిని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. గవర్నర్ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్పై స్టేటస్ కో ఇచ్చింది. దాన్ని కొనసాగిస్తోంది. స్టేటస్ కో దాదాపుగా మూడు వారాల పాటు పొడిగింపునకు గురి కావడం జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బగానే భావిస్తున్నారు.
అక్టోబర్లో దసరా ఉత్సవాల నాటికి సాగర నగరం విశాఖపట్నం నుంచి పరిపాలనను ప్రారంభించాలనే పట్టుదలతో కనిపించిన ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన తాజా పొడిగింపు.. నిరుత్సాహ పరిచిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ.. స్టేటస్ కో వల్ల ముందుకు కదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయని చెబుతున్నారు. ఫలితంగా మూడు రాజధానుల ఏర్పాటులో జాప్యం ఏర్పడే అవకాశాలు లేకపోలేదనే వాదనలు వ్యక్తమౌతున్నాయి.