అర్చకులు వర్సెస్ టిటీడి : హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు..
టిటిడీ లో పని చేస్తున్న మీరాశి వంశీకులకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుం టోంది. అర్చకులకు అనుకూలంగా ఏపి హైకోర్టు ఇచ్చిన తీర్పు పై టిటిడీ ప్రభుత్వంతో సంప్రదింపులు మొదలు పెట్టింది. ఈ తీర్పు పై సుప్రీం కోర్టుకు వెళ్లాలని టిటిడి నిర్ణయించింది. హైకోర్టు తీర్పుతో ఒక రకంగా టిటిడి సంకట స్థితిలో పడింది. ఇద్దరు తో మొదలైన ఈ వివాదం ఇప్పుడు ఎటువైపు తిరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.
టిటిడీ లో పని చేస్తున్న మీరాశీ వంశీకుల అర్చకులపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రయోగించిన రిటైర్ మెంట్ అస్త్రం బెడిసికొట్టింది. మీరాశీ కుటుంబాలకు చెందిన అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా కొనసాగించాలం టూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో టీటీడీ పాలక మండలికి షాక్ తగిలింది. టీటీడీలో మీరాశీ కుటుంబా లకు చెందిన 52 మంది వంశపారంపర్య అర్చక స్వాములు ఉన్నారు. వీరితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20 వేల ఆలయాల్లో వేలాది మంది అర్చకులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఏడాది మే 16న టీటీడీ పాలకమండలి వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో పనిచేస్తున్న వారిలో 65 ఏళ్లు పైబడిన అర్చకులకు రిటైర్మెంట్ తప్పదని తేల్చిచెప్పింది. దీనిపై అర్చకులు ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయం అమలైతే... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో పని చేస్తున్న అర్చకులందరికీ వర్తించే అవకాశం ఉంది. తిరుమలలో జరుగుతున్న అపచారాలను బయటపెడుతున్న శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై కక్ష సాధించడానికే రిటైర్మెంట్ అస్త్రాన్ని టీటీడీ ప్రయోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. తిరుమల, తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో పనిచేస్తున్న మీరాశీ వంశీకులకు చెందిన నలుగురు ప్రధాన అర్చకులు, ఆరుగురు అర్చకులను రిటైర్మెంట్ పేరుతో టీటీడీ ధర్మకర్తల మండలి ఇంటికి పంపించింది.
ఏపీ ప్రభుత్వం 1987 డిసెంబర్ 16న జీఓ నంబర్ 1171, 2012 అక్టోబర్ 16న ఇచ్చిన జీఓ నంబర్ 611 ప్రకారం అర్చకుల పదవీ విరమణ వయో పరిమితిని 65 సంవత్సరాలుగా టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించిందని ఈవో సింఘాల్ గుర్తుచేస్తున్నారు. ఈ పరిస్ఙతుల్లో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని టీటీడీ నిర్ణయిం చినట్లు తెలిసింది.