42 మందికి ప్రయోజనం..? చంద్రబాబుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విసుర్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్గా జరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. విద్యుత్ రంగంపై ఇవాళ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను ఆయన ప్రస్తావించారు. తక్కువ సమయంలో ఎలా కేటాయింపులు చేశారని అడిగారు.
టీడీపీ పాలనలో విద్యుత్ రంగం నష్టాల్లోకి వెళ్లిందని రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. యూనిట్ రూ.2 దొరికే విద్యుత్ను రూ.4.83 పైసలకు కొనుగోలు చేశారని ఆరోపించారు. ప్రజల సొమ్మును చంద్రబాబు ప్రభుత్వం అప్పనంగా 42 మందికి ధారాదత్తం చేసిందని మండిపడ్డారు. కేవలం 45 రోజుల్లో హుటాహుటిన 42 అగ్రిమెంట్లను కుదుర్చుకున్నారని విరుచుకుపడ్డారు.
గత ప్రభుత్వ చర్యతో వేల కోట్ల రూపాయలు భారం పడిందన్నారు. ఆ పరిస్థితుల్లో వాయు విద్యుత్ గురించి రివ్యూ చేశారని చెప్పారు. 45 రోజుల్లో 42 అగ్రిమెంట్లపై సమీక్షించారని తెలిపారు. విండ్ మిల్లు పెట్టాలంటే సంవత్సర సమయం పడుతుందని.. కానీ 45 రోజుల్లోపే ఒప్పందం, విద్యుత్ ఉత్పత్తి కూడా చేసినట్లు టీడీపీ ప్రభుత్వం చెప్పిందని తెలిపారు.
విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల వారికి 50 పైసలు యూనిట్కు ఇన్సెంటివ్ ఇచ్చినట్టు చెప్పుకుందని తెలిపారు. ఇవీ లెక్క చేస్తే రూ.2 వేల కోట్లకు పైగా వ్యత్యాసం వచ్చిందన్నారు. ప్రజలు కట్టే పన్ను ఆదాయం 42 మందికి ధారాదత్తం చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నించారని చెప్పారు. అదీ తప్పు అని చెప్పేందుకే తాము వాయు విద్యుత్పై రివ్యూ చేశామని వివరించారు.