ఫలితాల పై మంత్రుల మనసులో మాట : మా ప్రత్యర్ధి బలవంతుడు..ప్రజల్లోనే ఉంటాడు: అయినా......!
ఏపీలో పోలింగ్ ముగిసన తరువాత తొలిసారి కేబినెట్ సమావేశం జరిగింది. మంత్రులు చాలా రోజుల తరువాత అమరావతిలోని సచివాలయానికి వచ్చారు. చాలా మంది మంత్రులు పేషీలకు కూడా వెళ్లలేదు. కేబినెట్ సమావేశంలో మాత్రమే పాల్గొన్నారు. ఇదే సమయంలో కొందరు మంత్రులు పోలింగ్ సరళి గురించి విశ్లేషించుకున్నారు. ఆ సమయంలో కొందరు మంత్రులు మనసులో మాటను బయట పెట్టేసారు.
మా ప్రత్యర్ది బలవంతుడు..
సచివాలయానికి వచ్చిన మంత్రులు పోలింగ్ సరళి గురించి విశ్లేషణలు చేసుకున్నారు. ఆ సమయంలో నెల్లూరు సిటీ నుండి పోటీలో ఉన్న నారాయణ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. నెల్లూరు సిటీలో పోలింగ్ పూర్తయిన తరువాత కూడా మంత్రి నారాయణ గెలుస్తున్నారంటూ టీడీపీ నేతలు ప్రచారం చేసారు. కానీ, మంత్రి నారాయణ నెల్లూరు సిటీలో పోటీ గురించి షేర్ చేసుకున్నారు. గెలుపు ఖాయమా అని ప్రశ్నించగా.. తమ ప్రత్యర్ధి బలవంతుడని..ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటాడని చెబుతూ..అయితా ఎదుర్కొన్నానని..ఏం జరుగుతుందో చూద్దామంటూ ముక్తాయింపు ఇచ్చారు. మరి ఏపీలో తిరిగి అధికారంలోకి వస్తారా అంటే..ఇదే సమాధానం అని చెప్పుకొచ్చారు. దీనికి కొనసాగింపుగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా అంటే నవ్వు మినహా సమాధానం లేదు. నెల్లూరు జిల్లాలో ఎన్ని సీట్లు అంటే...23న మీరే చూడండి అంటూ అక్కడి నుండి నెమ్మదిగా జారుకున్నారు.
ధీమాగా చెబుతూనే..లోలోపల మాత్రం..
మరి కొంత మంది మంత్రులు సైతం తమ జిల్లాల్లో పరిస్థితిని ఒకరికి ఒకరు షేర్ చేసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి తమ జిల్లాలో పది సీట్లు టీడీపీ సాధిస్తుందని చెప్పుకొచ్చారు. ఆయన ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇది మీ అంచనాగా చెబుతున్నారా అంటే..పార్టీ లెక్క అంటూ సమాధానం ఇచ్చారు. ఇక, విశాఖ కు చెందిన మరో సీనియర్ మంత్రి తమ జిల్లాలో టీడీపీ పది సీట్లు సాధిస్తుందని విశ్లేషించారు. తమ జిల్లాలో కొత్తగా మంత్రిగా అవకాశం దక్కించుకున్న యువనేత ఎలక్షనీరింగ్ సరిగ్గా చేయలేకపోయారని..ఆయన గెలవటం కష్టమని చెప్పుకొచ్చారు. ఇక, కడప జిల్లా మంత్రి ఆదినారాయణ రెడ్డి మాత్రం తమ జిల్లాలో టీడీపీ నాలుగు అసెంబ్లీ సీట్లు గెలుస్తుందని ధీమాగా చెబుతున్నారు. కడపలోనే నాలుగు సీట్లు టీడీపీకి వస్తే ..ఇక గెలుపు గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదంటూ సహచర మంత్రులు వ్యాఖ్యానించగా..అందరూ ఒక్కసారిగా నవ్వేసారు.
ఏదా ఏమైనా గెలుపు మనదే..
ఏ సర్వేలు ఏం చెప్పినా..ఎన్నికల్లో గెలిచేది మాత్రం మనమే అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సహచర మంత్రులకు ధైర్యం చెప్పారు. ఎగ్జిట్ పోల్ ఫలితాల గురించి ఆందోళన అవసరం లేదని పేదలు..మహిళలు,వృద్దులు మనతోనే ఉన్నారని..ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసారు. ఏపీలో తామే తిరిగి అధికారంలోకి వస్తామంటూనే..కేంద్రంలో బీజేపీ వచ్చే అవకాశం లేదని..వచ్చినా మోదీ మాత్రం ప్రధాని కారంటూ విశ్లేషణలు చేసుకున్నారు. ఏదీ ఏమైనా..మంత్రుల్లో మాత్రం అంతగా ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయనే నమ్మకం ఉన్నట్లు కనిపించటం లేదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.