ఏపీ పుర పోరులో యువతే అధికం.. 25 శాతం మంది కొత్తే, సీఎం జగనే ఆదర్శమట..
ఏపీలో పురపోరు హీట్ సెగలు రేపుతోంది. రాజకీయాలు అంటేనే.. అనుభవం.. తలపండిన నేతలు పాలిటిక్స్లో ఉంటారు. కానీ ఇక్కడ విచిత్రంగా యువతే అధికంగా ఉన్నారు. పంచాయతీ ఎన్నికలతోపాటు మున్సిపల్ ఎన్నికల్లో 35 శాతం యువత బరిలోకి దిగారు. సీఎం జగన్ను ఆదర్శంగా తీసుకొని పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. రిజర్వేషన్లు/ స్థానిక పరిస్థితుల ఆధారంగా వారసులు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు.
35 శాతం యువత
రాష్ట్రంలో 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండగా.. 14718 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 35 శాతం మందికి పైగా యువత బరిలో ఉన్నారు. 4700 మంది యువతీ యువకులు పోటీలో నిలిచారు. 22 నుంచి 25 ఏళ్ల లోపు ఉండే యువత 12 శాతం పైగా ఉన్నారు. తొలిసారి పోటీ చేస్తోన్న వారి సంఖ్య కూడా 25కు పైగా ఉంది. దీంతో యువత ఏ స్థాయిలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇదివరకు అయితే ఎన్నికల ప్రచారం కోసం మాత్రమే యువతను ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
రంగంలోకి యూత్
రాష్ట్రంలో ఎప్పుడు, ఎక్కడ, ఏ ఎన్నికలు జరిగినా పోటీలో ఉన్న అభ్యర్థి వెనక అత్యధిక శాతం మంది యువత ఉండేవారు. అన్నీ కార్యక్రమాలను చేపట్టేవారు. రోజులు మారిన కొత్త.. ఎన్నికల ప్రక్రియ రూపురేఖలే మారిపోతున్నాయి. ఈ క్రమంలో యువత ఒకరికి జై కొట్టడం కంటే మనమే ముందుండి నడవాలని నిర్ణయించుకున్నారు. రాజకీయాల్లో అవకాశాల కోసం యువత ఎదురుచూస్తుండగా.. సీఎం జగన్ ఛాన్సెస్ కల్పిస్తున్నారు. దీంతో పురపోరులో యువతే కనిపిస్తున్నారు.
25 శాతం మంది కొత్తగా
2013లో జరిగిన స్థానిక ఎన్నికల్లో పోలీస్తే యువత ప్రాతినిధ్యం పెరిగింది. గతంలో 10 శాతం లోపు యువత ఉంటే.. ఇప్పుడు 35 శాతం మంది వరకు పోటీలో ఉన్నారు. 25 శాతం మంది యువత రాజకీయాల్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదివరకు పేరంట్స్ విజయంలో కీ రోల్.. బంధువర్గం గెలిపించేందుకు యువత శక్తిమేర పనిచేసేవారు. ఈ ఎన్నికల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తోంది. 50 శాతం మహిళలకు పోటీ చేసే అవకాశం కల్పించింది. దీంతో సీనియర్ నేతలకు ఛాన్స్ లేకుండా పోయింది. అందుకే తమ వారసులను రంగంలోకి దింపాల్సి వచ్చింది. మరికొన్ని చోట్ల అల్లుళ్లను కూడా పోటీలో ఉంచారు.
సీనియర్ల తడబాటు
మరోవైపు యువత అధిక సంఖ్యలో పోటీలో ఉండగా.. ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు. కొన్నిచోట్ల సీనియర్లు బరిలో ఉన్నా.. వారితో సమానంగా క్యాంపెయిన్ చేయలేకపోతున్నారు. ఎన్నో ఎళ్లుగా రాజకీయ రంగంలో ఉన్నా.. ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న.. ఈ సారి మాత్రం ప్రభ చూపడం లేదు. యువతతో సరిసమానంగా ఉండటం లేదు. బరిలో ఉన్న యువత అంతా సీఎం జగన్ను ఆదర్శంగా తీసుకోవడం విశేషం.