ఏపి నూతన సచివాలయ నిర్మాణ ముహూర్తం 19న : దేశంలోనే అతి పెద్ద నిర్మాణం
ఏపి రాజధాని లో కీలకమైన నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. పరిపాలన నగరంలో ముఖ్యమైన శాశ్వత సచివాలయ నిర్మాణ పనులను ఈ నెల 19 నుండి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయిదు టవర్లుగా నిర్మిస్తున్న ఈ సచివాయలం కోసం అదే రోజు ర్యాఫ్ట్ ఫౌండేషన్ పనులు ప్రారంభించనున్నారు. దేశంలోనే అత్యంత భారీ ర్యాఫ్ట్ ఫౌండేషన్ గా ఇది అరుదైన ఖ్యాతిని నమోదు చేసుకోబోతోంది.
అరుదైన నిర్మాణం తో ఖ్యాతి..
ఏపి రాజధాని అమరావతిలో శాశ్వత నిర్మాణాల దిశగా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. రాజధాని లో కీలకమైన పరి పాలనా నగరం అందునా సచివాలయం నిర్మాణ పనులను వేగిరం చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. అయిదు టవర్లుగా సచివాలయం నిర్మించాలని నిర్ణయించారు. దీని కోసం ఈ నెల 19న ర్యాఫ్ట్ ఫౌండేషన్ పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. 12 వేల క్యూ.మీ. మేర 13 అడుగుల లోతులో ర్యాఫ్ట్ ఫౌండేషన్ జరగనున్నదని, దేశంలో ఈ తరహా భారీ నిర్మాణం ఇదేనని సిఆర్డీఏ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
రాజధానిలో నూతన సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలను ప్రపంచస్థాయి ప్రమాణాలతో, అత్యంత భారీ భవంతులకు దీటుగా, ఆధునిక హంగులతో నిర్మిస్తున్నామని, దీనికి సంబంధించిన ర్యాఫ్ట్ ఫౌండేషన్ కూడా అదే స్థాయిలో చేపడుతున్నట్లు అధికారులు వివరించారు.
ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణశిల్పి నార్మన్ ఫోస్టర్కి చెందిన ఫోస్టర్ అండ్ పార్టనర్ సంస్థ సచివాలయం కోసం ఐదు టవర్ల నిర్మాణానికి సంబంధించిన ఆకృతులను, నిర్మాణ ప్రణాళికలను సీఆర్డీఏకు అందించింది. ఈ ఐదు టవర్లను ఒకే రాఫ్ట్ ఫౌండేషన్పై నిర్మిస్తున్నామని, అందుకోసం వేల మంది కార్మికులను, వందల సంఖ్యలో యంత్రాలను, టన్నుల కొద్ది నిర్మాణ సామగ్రిని ఉపయోగిస్తున్నారు.