ఏపీ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు.. టెన్షన్, టెన్షన్
ఏపీలో పంచాయతీ ఎన్నికల పంచాయితీ కొనసాగుతోంది. ఎస్ఈసీ వర్సెస్ సర్కార్ వార్ పీక్కి చేరింది. ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల చేయడం.. సర్కార్ హైకోర్టును ఆశ్రయించడంతో ఉత్కంఠ నెలకొంది. ఏపీ సర్కార్ పిటిషన్పై నేడు హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. అయితే షెడ్యూల్ విడుదలయ్యాక ఇంతవరకు కోర్టుల జోక్యం చేసుకున్న దాఖలాలు లేవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. వాయిదా వేసినా.. నిర్వహించినా సంచలనమేనని చెబుతున్నారు. ఇటు ఎస్ఈసీపై ఉద్యోగ సంఘాల నేతలు కూడా విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు సోమవారం ఎలాంటి తీర్పు ఇస్తుందా అనే టెన్షన్ నెలకొంది.
ఇప్పుడు నిర్వహించలేం..
కరోనా వల్ల స్థానిక ఎన్నికలను నిమ్మగడ్డ వాయిదావేయడంతో సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం అదేసాకుతో ఎన్నికలు జరుపలేమని వాదిస్తోంది. రాష్ట్రమంతా కరోనా వ్యాక్సిన్ వేయాల్సి ఉన్నందున ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టును ఆశ్రయించింది. సోమవారం దీనిపై ధర్మాసనం విచారణ జరిపి తీర్పు ఇచ్చే అవకాశాలున్నాయి. తీర్పు ఎలా వచ్చినా చరిత్ర అవుతుందని భావిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ఒకసారి ప్రారంభించాక కోర్టులు జోక్యం చేసుకోవడం ఇంతవరకు జరగలేదు.పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని కోర్టు ఆదేశిస్తే.. అది సంచలనమే అవుతుందని న్యాయ నిపుణులు అంటున్నారు. స్థానిక ఎన్నికలు జరపాల్సిందేనని ఎస్ఈసీ నిర్ణయాన్ని కోర్టు సమర్థిస్తే.. ఇందుకు సుముఖంగా లేని ప్రభుత్వం ఏం చేస్తుందన్నది కీలకంగా మారింది. ఎస్ఈసీకి సహాయ నిరాకరణ చేస్తామని ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలు కూడా ప్రకటించారు.
వాయిదా వేయడం అరుదు..
ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక ఎన్నికలను వాయిదా వేసిన సందర్భాలు ఏపీలో తప్ప ఎక్కడా జరగలేదని నిపుణులు అంటున్నారు. కరోనా వల్ల నిమ్మగడ్డ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేసిన విషయం విదితమే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం కోర్టుకెళ్లినా.. ఎస్ఈసీ నిర్ణయాన్నే సుప్రీంకోర్టు సమర్థించింది. షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుంది. ఎన్నికలు వాయిదా వేయాలన్నా, నిలిపివేయాలన్నా.. ఎస్ఈసీ చేతిలోనే ఉంది.
బెంగాల్లో ఏం జరిగిందంటే..
రెండేళ్ల కింద పశ్చిమ బెంగాల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని ఎస్ఈసీకి వ్యతిరేకంగా ఆ రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టు కు వెళ్లింది. అయితే రాజ్యాంగంలోని 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం స్థానిక ఎన్నికలు సకాలంలో జరగాల్సిందేనని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇటీవల కేరళ స్థానిక ఎన్నికల విషయంలోనూ జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఎస్ఈసీ.. ఈ నెల 9వ తేదీ నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. దీంతో రాష్ట్రప్రభుత్వ యంత్రాంగమంతా ఎన్నికల సంఘం పరిధిలోకి వచ్చినట్లయింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23న పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది.
ఉద్యోగులపై ఒత్తిడి
ఎన్నికల
విధుల్లో
పాల్గొనవద్దని
అధికార
యంత్రాంగాన్ని
పెద్దలు
ఆదేశించే
అవకాశాలున్నాయని..
ప్రభుత్వ
పరిస్థితిని
గమనిస్తున్న
వారు
చెబుతున్నారు.
అదే
జరిగితే
రాష్ట్రంలో
ఎప్పుడూ
లేని
విధంగా
రాజ్యాంగ
సంక్షోభ
పరిస్థితి
తలెత్తుతుంది.
రాష్ట్ర
ఎన్నికల
సంఘం
రాజ్యాంగబద్ధ
సంస్థ.
కేంద్ర
ఎన్నికల
కమిషన్తో
సమాన
అధికారాలు
కలిగి
ఉంది.
ప్రభుత్వ
పెద్దల
ఒత్తిడితో
ఎన్నికల
ప్రక్రియకు
సహకరించని
ఉద్యోగులు,
అధికారులపై
రాష్ట్ర
ఎన్నికల
కమిషనర్
చర్యలు
తీసుకోవచ్చు.
ప్రస్తుత
పరిస్థితుల
నేపథ్యంలో..
రాష్ట్ర
ఎన్నికల
సంఘం
తనకున్న
అధికారాలకు
పదును
పెడుతోంది.
ఏ తీర్పు ఇచ్చినా సంచలనమే
షెడ్యూల్ విడుదలైనందున ఎన్నికలు వాయిదా వేయాలని కోర్టు తీర్పు ఇస్తే తప్ప.. ఎన్నికలు తప్పనిసరి. రాష్ట్ర యంత్రాంగం సహకరించకపోతే పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అదే జరిగితే ఎస్ఈసీ తనకున్న అధికారాలను వినియోగించి అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తుందని.. ఈ ఆదేశాలను అమలు చేయకుంటే గవర్నర్కు, రాష్ట్రపతికి ఎన్నికల సంఘం ఫిర్యాదు చేసే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. రాజ్యాంగ బద్ధ విధుల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైనట్లు అవుతుందని.. రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుందని చెబుతున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగి.. రాష్ట్ర ప్రతిష్ఠ మసకబారుతుందని ఆందోళన చెందుతున్నారు.