ఏపీ మూడో దశ ఫలితాలు: స్పీకర్ సతీమణి విజయం, పలుచోట్ల ఘర్షణలు
ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. మెజార్టీ స్థానాల్లో అధికార వైసీపీ హవా కొనసాగుతోంది. టీడీపీ, బీజేపీ కనిపించడం లేదు. జనసేన కూడా ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఇటు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగరాం సర్పంచ్గా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం భార్య వాణిశ్రీ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రత్యర్థిపై ఆమె 510 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఫలితం వెలువడిన వెంటనే గ్రామంలోని వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. వాణిశ్రీకి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం గ్రామంలో ఊరేగించారు.
కొండవలసలో ఉద్రిక్తత
శ్రీకాకుళం రేగిడి మండలం కొండవలస గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లి గ్రామస్తులు తగులబెట్టారు. పోలింగ్ సిబ్బందిని నిర్బంధించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో లాఠీ చార్జీ చేయాల్సి వచ్చింది. పలువురు గ్రామస్తులు గాయపడ్డారు. రీ పోలింగ్ జరపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఓవరాక్షన్
మంత్రి బొత్స సత్యనారాయణ నియోజకవర్గంలో అధికారులు ఓవరాక్షన్ చేశారు. నియోజకవర్గంలో పలు చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలిచినా ఫలితాలను అధికారులు వెల్లడించడం లేదు. వైసీపీ ఒత్తిడితో ఫలితాలు వెల్లడించకుండా ఎన్నికల అధికారులు కాలయాపన చేస్తున్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల అధికారుల తీరుకు నిరసనగా టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు.
టీడీపీ అభ్యర్థి గెలిచినా..
అనంతపురం: జిల్లా ఆత్మకూరు మండలంలో మదిగుబ్బ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి 150 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. అయితే రీకౌంటింగ్కు వైసీపీ పట్టుబడింది. రీకౌంటింగ్లోనూ టీడీపీకి రెండు ఓట్ల ఆధిక్యత లభించింది. ఈ గ్రామంలో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ప్రచారం చేశారు.
కళా వెంకట్రావ్ స్వగ్రామంలో హవా
టీడీపీ నేత కళా వెంకట్రావు సొంత ఊరు రేగిడిలో టీడీపీ మద్దతుదారుడు విజయం సాధించారు. రేగిడి సర్పంచ్గా కిమిడి రేణుక 700 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 207 పంచాయతీల్లో 1,720 వార్డులకు ఈ విడతలో ఎన్నికలు నిర్వహించారు.