రూ.1500 కోట్ల విలువజేసే భూములు: ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడతారా, జగన్పై అయ్యన్న ఫైర్
ఏపీ సీఎం జగన్పై మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు విరుచుకుపడ్డారు. ప్రభుత్వ భూములను అనుయాయులకు దారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఆర్టీసీ ఆస్తులపై జగన్ కన్నుపడిందని చెప్పారు. విలువైన భూములను అప్పనంగా కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు తుంగలో తొక్కి మరీ కేటాయింపులు చేస్తున్నారని ఫైరయ్యారు.
ప్రభుత్వ భూములు దారాదత్తం ప్రక్రియ ముగిసిందని.. అందుకే ఆర్టీసీ భూములను కూడా వదలడం లేదని అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆర్టీసీకి చెందిన 1300 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి రంగం సిద్దమైందని చెప్పారు. నియమాలు/ నిబంధనలు లేవు అని గుర్తుచేశారు. గతంలో తమ ప్రభుత్వం 33ఏళ్లపాటు లీజుకు ఇస్తే జగన్ తప్పుపట్టారని గుర్తుచేశారు. మరీ ఇవాళ ఆయన చేస్తుంది ఏంటీ అని అడిగారు. 50 ఏళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడని తెలిపారు.
విశాఖపట్నం, కర్నూలు, తిరుపతిలో ఆర్టీసీకి రూ.1500 కోట్ల విలువచేసే స్థలాలు ఉన్నాయని అయ్యన్నపాత్రుడు గుర్తుచేశారు. వాటిని 50 ఏళ్లపాటు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రక్రియ జరుగుతోందన్నారు. మరీ తిరిగి సంస్థ స్వాధీనం చేసుకుంటుందా అని అడిగారు. లీజుదారులు కోర్టులకు వెళ్లి సంవత్సరాల కొద్దీ భూములను అనుభవించడాన్ని ఇప్పటికీ చూస్తున్నామని చెప్పారు. మరీ ఈ భూముల సంగతి ఏంటీ అని అడిగారు.
ఆర్టీసీ సంస్థ, ఉద్యోగులు, అధికారులు, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సీఎం జగన్ తీసుకోబోతున్న నిర్ణయాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించాలని సూచించారు. లేదంటే ఆర్టీసీ విలువైన ఆస్తిని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఆర్టీసీ, ప్రభుత్వ భూములను ప్రైవేట్ వారికి అప్పగించడం వల్ల తలెత్తే సమస్యలను సీఎంకు వారు వివరించాలని సూచించారు.