అమరావతిని అడ్డుగా పెట్టుకుని అడ్డగోలుగా దోచేశాడు: ఖాళీ జాగాల్లో జెండా
అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతాన్ని అడ్డుగా పెట్టుకున్నాడో ఓ మామూలు రెవెన్యూ అధికారి. అమరావతిని కేంద్రంగా చేసుకుని అడ్డగోలుగా దోచేశాడు. రాజధాని ప్రాంతంలో ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే, అక్కడ తన జెండా పాతుకుంటూ పోయాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. 10 ఖాళీ స్థలాలను తన ఖాతాలో వేసుకున్నాడు. తన సొంతం చేసుకున్నాడు. దీనికోసం నకిలీ పత్రాలను కూడా సృష్టించాడు. అమరావతిని ఆనుకుని ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాలో భారీగా స్థిర, చరాస్తులను కూడ బెట్టాడు. ఆయన సొంతం చేసుకున్న భూమికి సంబంధించిన ఓ వివాదంలో సీఐడీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఆయనకు ఉన్న ఆస్తుల విలువ 40 కోట్ల రూపాయలుగా లెక్కగట్టారు సీఐడీ అధికారులు.
అతని పేరే శివరావు. రెవెన్యూ శాఖలో తహశీల్దార్. డెప్యుటేషన్ పై పర్యాటక అభివృద్ధి సంస్థలో ఎస్టేట్ అధికారిగా పనిచేస్తున్నాడు. 1987లో గ్రూప్ 4 పరీక్షలను రాసి, రెవెన్యూ శాఖలో టైపిస్ట్ గా చేరాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. ఈ 30 ఏళ్ల కాలంలో ఇన్ని పదోన్నతులు ఎలా సాధ్యపడ్డాయో గానీ..తహశీల్దార్ హోదాకు చేరుకున్నాడు. కేరీర్ మొత్తం అవినీతిమయమే. తాను పనిచేసిన ప్రతి జిల్లాలోనూ అవినీతికి పాల్పడ్డాడు. సెటిల్ మెంట్లకు ప్రతిఫలంగా స్థలాలను రాయించుకున్నాడు. సీఐడీ అధికారుల కోరిక మేరకు ఈ కేసును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతని ఇళ్లల్లో సోదాలు చేపట్టారు. 14 ఇళ్ల స్థలాలు, రెండు ఫ్లాట్లు, రెండు ఇళ్లు, 96 సెంట్ల వ్యవసాయ భూమి, అక్కడ ఓ ఫామ్ హౌస్ ఉన్నట్లు తేలింది. ఈ ఆస్తుల విలువ సుమారు రూ. 40 కోట్లు ఉంటుందని అంచనా.
కృష్ణాజిల్లాలో కీలక ప్రాంతాల్లో..
డెప్యుటేషన్ పై పర్యాటక శాఖకు వెళ్లడానికి ముందు కృష్ణాజిల్లాలో వివిధ ప్రాంతాల్లో మూడేళ్ల పాటు పనిచేశాడు. 2003 నుంచి 2006 వరకు పెనమలూరు మండల డిప్యూటీ తహశీల్దార్గా పనిచేశారు. అనంతరం మోపిదేవి, కంకిపాడు, గన్నవరం మండలాల్లో 2009 నుంచి 2012 వరకు పనిచేశారు. 2012 నుంచి 2018 వరకు విజయవాడ అర్బన్ తహశీల్దార్గా పనిచేశారు. అలా పని చేసిన ప్రతిచోటా కోట్లాది రూపాయల ఆస్తులను సంపాదించగలిగారు. తనకు ఉన్న క్రిమినల్ బ్రెయిన్ ను ఉపయోగించాడు. రెవెన్యూ శాఖలో భూమి రికార్డులపై పట్టు సాధించారు. అదే సమయంలో రాజధాని అమరావతిని ప్రకటించడం, శివరావుకు మరింత కలిసివచ్చింది. దీన్ని బాగా `సొమ్ము` చేసుకున్నాడు.
సీఆర్డీఏ పరిధిలో కోట్లాది రూపాయల విలువ చేసే భూములను ముందుగా కొనుగోలు చేసి పెట్టుకున్నాడు. రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు భారీగా సాగుతున్న కంకిపాడు, పెనమలూరు, కంచికచర్ల మండలాల్లో భూములను బినామీల పేరున పెట్టాడు. శివరావు సంపాదించిన 14 ఖాళీ స్థలాల్లో 10 సీఆర్డీఏ పరిధిలోనే ఉండటం అతని అవినీతికి నిదర్శనం. సీఆర్డీఏ చట్టంలో ఉన్న అనేక లొసుగులను తనకు అనుకూలంగా మార్చుకున్న శివరావు అందులో నుంచే కోట్లాది రూపాయల విలువ చేసే స్థిరాస్తులను సంపాదించగలిగాడు.
బయట పడింది ఇలా..
విజయవాడ అర్బన్ తహశీల్దార్గా శివరావు కొంతకాలం పనిచేశాడు. విజయవాడలోని అజిత్సింగ్ నగర్లో స్వాతంత్య్ర సమరయోధుడు కసిరెడ్డి సూర్యనారాయణకు చెందిన భూమిని వేరొకరి పేరు మీద బదలాయించాడు. దీనికి సంబంధించిన కొన్ని నకిలీ పత్రాలను సృష్టించాడు. సూర్యనారాయణకు చెందిన భూమిని అబ్దుల్ మస్తాన్ అనే వ్యక్తి పేరు మీద అడంగల్ ఉన్నట్లు మార్చేశారు. దీనికోసం అబ్దుల్ మస్తాన్ నుంచి పెద్ద ఎత్తున లంచం తీసుకున్నాడు. ఆ లంచం కూడా భూ రూపంలోనే తీసుకోవడం గమనార్హం. అబ్దుల్ మస్తాన్ పేరు మీద విజయవాడ సుబ్బరాజునగర్లో ఉన్న 75 సెంట్ల భూమిని బదలాయించుకున్నాడు. తన బావమరిది పేరుపై జీపీఏ చేయించుకున్నాడు.
దీనిపై సూర్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే శివరావు డెప్యుటేషన్ పై పర్యాటకాభివృద్ధి సంస్థలో ఎస్టేట్ అధికారిగా వెళ్లారు. రంగంలోకి దిగిన పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. ఈ కేసును సీఐడీకి బదలాయించారు. కేసు నమోదు చేసిన సీఐడీ.. శివరావు అక్రమాలన్నింటినీ వెలుగులోకి తీసుకొచ్చింది. ఏసీబీతో కలిసి ఉమ్మడి దర్యాప్తును ఆరంభించింది. శివరావుకు చెందిన నివాసాలు, బినామీల ఇళ్లపై కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో సోదాలు చేపట్టారు. అర్ధరాత్రి దాటినా కొనసాగుతూనే ఉన్నాయంటే, అతను అక్రమంగా కూడబెట్టిన ఆస్తులు విలువ ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. శివరావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఆస్తుల చిట్టా ఇదీ..
విజయవాడ శ్యామలానగర్లో ఉన్న స్మిత టవర్స్ రెండు ఫ్లాట్లు శివరావు పేరు మీద రిజిస్టరై ఉన్నాయి. అలాగే రామవరప్పాడు కార్మెల్ నగర్లో 73.23 చదరపు గజాల స్థలం ఉంది. అదే ప్రాంతంలో మరో చోట 73.33 చదరపు గజాల ఖాళీ స్థలం, హనుమాన్ నగర్లో 257 గజాల ఖాళీ స్థలం, గుంటూరు జిల్లా నంబూరులో 220 గజాలు చొప్పున రెండు ఖాళీ స్థలాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. దీనితోపాటు- గూడూరు మండలం చిట్టి గూడురులోని శర్వాణి పోర్టు హైవే సిటీలో 729.66 గజాలు, కంచికచర్ల మండలం ములుగులో 667 గజాలు, అదే ప్రాంతంలో వేరే సర్వే నంబర్ లో మరో 200 గజాల స్థలం ఉన్నట్లు తేలింది.
కంకిపాడులోని గొడవర్రు రోడ్డులో 96.8 చదరపు గజాలు, అదే మండలం పరిధిలోని ఈడ్పుగల్లులో 84.8 చదరపు గజాల్లో ఓ ఇల్లు, విజయవాడ భవానీ రోడ్డులో 48.61 చదరపు గజాల్లో ఇల్లు ఉన్నాయి. కృష్ణా జిల్లా బండారుగూడెంలో 377.2 గజాల స్థలం, తెంపెల్లెలో 96 సెంట్ల భూమి, కంకిపాడు మండలం గొడవర్రు రోడ్డులో 257.13 చదరపు గజాల స్థలం, అదే ప్రాంతంలో మరో 145.2 చదరపు గజాల స్థలం ఉన్నాయి. కంచికచర్ల మండలం ములుగు గ్రామంలో 667 గజాల స్థలం, గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమేడ గ్రామంలో 88సెంట్ల భూమి ఉన్నట్లు స్పష్టమైంది. 18 లక్షల రూపాయల నగదు, 793 గ్రాముల బంగారం, కిలో వెండి, మూడు లక్షల విలువ చేసే ఎల్ఐసీ పాలసీలు ఉన్నాయి. మరో 20 లక్షల రూపాయల వరకు చిట్స్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడైంది.