బీజేపీలోని టీడీపీ మాజీలకు చెక్ పెట్టేలా: కన్నాను తొలగించిన రోజే..షోకాజ్ జారీ: భారీ ప్రక్షాళన
అమరావతి: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖలో పెనుమార్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ మూల సిద్ధాంతాలకు భిన్నంగా ప్రవర్తిస్తోన్న నేతలకు చెక్ పెట్టేలా వ్యూహాలను రూపొందిస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ హయాంలో బీజేపీ గాడి తప్పిందని, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన కొందరు నేతలు గాడి తప్పించేలా వ్యవహరించారనే ఆరోపణలను ఇదివరకే ఎదుర్కొంటోన్న బీజేపీ..దాన్ని సరిచేయడానికి రంగంలోకి దిగిందనే అంటున్నారు. టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన లంకా దినకర్ సహా మరో ముగ్గురికి షోకాజ్ నోటీసులను జారీ చేయడాన్ని దీనికి నిదర్శనంగా చూపుతున్నారు.
ఏపీ బీజేపీలో భారీ మార్పు: కన్నా ఔట్ - కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం - కారణం ఇదేనా?
బీజేపీ సిద్ధాంతాలకు భిన్నంగా..
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఆ పార్టీకి చెందిన కొందరు కీలక నాయకులు బీజేపీలోకి చేరినే విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, తెలంగాణ నుంచి గరికపాటి మోహన్ రావు బీజేపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. లంకా దినకర్ వంటి ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. అక్కడిదాకా బాగానే ఉన్నప్పటికీ.. ఏపీకి చెందిన నాయకులు బీజేపీ సిద్ధాంతాలకు భిన్నంగా వాదనలను వినిపిస్తున్నారనే అభిప్రాయం చాలాకాలం నుంచీ వినిపిస్తూనే ఉంది.
బీజేపీలో ఉంటూ టీడీపీ గళం..
ప్రత్యేకించి- రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో పార్టీ లైన్కు భిన్నంగా తమ సొంత స్వరాన్ని లేదా టీడీపీ గళాన్ని వినిపించారనే ముద్ర వారిపై బలంగా పడిందని చెబుతున్నారు. మూడు రాజధానుల వ్యవహారం కేంద్రం పరిధిలో లేదని, అది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమనే విషయాన్ని.. బీజేపీలో మొదటి నుంచీ కొనసాగుతోన్న జీవీఎల్ నరసింహారావు వంటి నేతలు పదేపదే చెబుతున్నప్పటికీ.. పట్టించుకోవట్లేదనే అసంతృప్తి బీజేపీ నేతల్లో పలు సందర్భాల్లో వ్యక్తమైంది. అంతర్గత సమావేశాల్లో ఈ విషయం స్పష్టమైంది.
కన్నా కూడా అదే బాటలో..
పార్టీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ కూడా మూడు రాజధానులకు వ్యతిరేకంగా పోరాడటాన్ని బీజేపీలో ముందు నుంచీ కొనసాగుతోన్న నేతలకు నచ్చట్లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. కన్నా లక్ష్మీనారాయణ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన నేత కావడం వల్ల పార్టీ లైన్కు కట్టుబడి ఉండలేకపోయారని అంటున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి చంద్రబాబు నుంచి అయిదు కోట్ల రూపాయలను తీసుకున్నారనే ఆరోపణలు సైతం కన్నా మీద ఉన్నాయి.
టీడీపీ ముద్రను తుడిచేసేలా..
ఈ పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీ ముద్రను తుడిచేసేలా బీజేపీ నాయకులు చర్యలు తీసుకోబోెతున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా6 ఇప్పటికే పార్టీ నేత లంకా దినకర్కు షోకాజ్ నోటీసులను జారీ చేశారు. ఆయనతో పాటు మరో ముగ్గురికి షోకాజ్ నోటీసులను అందజేసినట్లు తెలుస్తోంది. తరచూ టీవీ చర్చల్లో పాల్గొనడం, పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం వంటి చర్యలను ఏపీ బీజేపీ అగ్ర నాయకులు తీవ్రంగా పరిగణించారు. షోకాజ్ నోటీసులను అందజేశారు.. లంకా దినకర్ కూడా సుదీర్ఘకాలం పాటు టీడీపీలో కొనసాగిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో టీడీపీ ఓటమి అనంతరం బీజేపీలో చేరారు.
Recommended Video
లంకా దినకర్తో షురూ
బీజేపీ డైహార్డ్ నేతగా సోము వీర్రాజుకు పేరుంది. అలాంటి నాయకుడికి పార్టీ రాష్ట్రశాఖ పగ్గాలను అప్పగించింది అధిష్ఠానం. పార్టీ బలోపేతం చేసేలా, క్షేత్రస్థాయిలో బలపడేలా, పార్టీ కోసమే శ్రమించే నేతలు, కార్యకర్తలకు మాత్రమే అందలం ఎక్కించే అవకాశం ఇస్తారని అంటున్నారు. టీడీపీ నుంచి వచ్చిన ఒక సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలకు మున్ముందు మరిన్ని షోకాజ్ నోటీసులను జారీ చేసే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. లంకా దినకర్కు షోకాజ్ ఇవ్వడంతో ఈ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారనే అభిప్రాయాలు పార్టీ నేతల్లో వ్యక్తమౌతున్నాయి.