క్యాంపు రాజకీయాలుః పార్టీ ఫిరాయింపులు అడ్డుకోవడానికి రిసార్టుల్లో బస
అమరావతిః క్యాంపు రాజకీయాలు, రిసార్టుల రాజకీయాలకు మొన్నటిదాకా కేరాఫ్ అడ్రస్గా నిలిచింది కర్ణాటక. ఆపరేషన్ కమలలో భాగంగా- తమ పార్టీ ఎమ్మెల్యేలను భారతీయ జనతాపార్టీ అడ్డగోలుగా కొంటోందని ఆరోపిస్తూ అధికారాన్ని పంచుకుంటున్న కాంగ్రెస్-జనతాదళ్ (ఎస్) కూటమి ప్రభుత్వం.. అనేక ముందుజాగ్రత్త చర్యలను చేపట్టింది. తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించింది. ఏరోజుకారోజు అన్నట్టు తమ ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ వస్తోంది అక్కడి ప్రభుత్వం.
తాజాగా ఇదే పరిస్థితి మన రాష్ట్రంలోనూ తలెత్తింది. అధికార తెలుగుదేశం పార్టీ ఫిరాయింపులను ఎదుర్కొంటోంది. ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తెలుగుదేశం పార్టీని వీడి వెళ్లే వారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. ఏ మాత్రం ఊహించని నాయకులు తెలుగుదేశాన్నివీడుతుండటం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకత్వం పూర్తిగా రక్షణాత్మక ధోరణిలో పడిపోయింది. ఎవ్వర్నీ నమ్మలేని స్థితికి చేరుకుంది.
మరో కర్ణాటక..!
మొన్నటివరకూ పార్టీ వెంటే ఉన్న లోక్ సభ సభ్యుడు పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడటం ప్రకంపనలు రేపింది. టీడీపీ వ్యవస్థాపన మూలస్తంభాల్లో ఒకరిగా గుర్తింపు ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త, విజయ్ ఎలక్ట్రికల్స్ అధినేత దాసరి జైరమేష్ కూడా బయటికి రావడం ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పార్టీ అగ్ర నాయకత్వానికి ఏ మాత్రం మింగుడు పడని విషయంగా భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఒంగోలు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి, ఓడిపోయిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి సహా కొందరు సిట్టింగులు వైఎస్ఆర్ సీపీలో చేరడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. రేపో, మాపో వారి లాంఛనం పూర్తి కావడం ఖాయం.
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రులు, సీనియర్లు `నువ్వు పద మేమొస్తాం..` అనట్టు ఒకరి వెనుక ఒకరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకుంటున్నారు. మొదట తెలుగుదేశంలో చేరాలని నిర్ణయించుకుని, ఆ తరువాత మనసు మార్చుకున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు వైఎస్ఆర్ సీపీలో చేరిపోయారు.
పోయే వారిని కాపాడుకోలేక సతమతం..
దీనితో అటు కొత్తవారిని ఆకట్టుకోలేక, ఇటు ఉన్న వారినీ కాపాడుకోలేక తెలుగుదేశం పార్టీ నాయకులు సతమతమౌతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇదే పరంపర కొనసాగితే.. జనంలో చులకన అవుతామని భావిస్తున్న పార్టీ నాయకులు క్యాంపు రాజకీయాలకు తెర తీస్తున్నారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే, ఎంపీలు, ఇతర పార్టీ ముఖ్య నాయకులందరినీ రిసార్టులకు తరలించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొందరిని విశాఖపట్నం జిల్లా భీమిలీలోని రిసార్టుకు కూడా తరలించినట్లు సమాచారం. పార్టీ నుంచి వెళ్లిపోతారని అనుమానం ఉన్న వారందరినీ తొలిదశలో రిసార్టులకు తరలించినట్లు చెబుతున్నారు. వారి వద్ద నుంచి సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు.
బీసీ, కాపులపై నజర్
బీసీ, కాపు కులస్తుల నాయకులపై తెలుగుదేశం పార్టీ ప్రత్యేకించి దృష్టి సారించింది. ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభ, అందులో ప్రకటించిన బీసీ డిక్లేరేషన్ తరువాత ఆ తరగతికి చెందిన పలువురు నాయకులు ప్రతిపక్ష పార్టీ వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉన్నట్లు టీడీపీ అనుమానిస్తోంది.
ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్, ఉత్తరాంధ్రలో అవంతి శ్రీనివాస్ ఇద్దరూ కాపు కులస్తులే. ఎన్నికల ముంగిట్లో వారిద్దరూ వైఎస్ఆర్ సీపీలో చేరిన ప్రభావం..తమ పార్టీలో మిగిలిన కాపు నాయకులపై చూపుతుందని కూడా సందేహిస్తున్నారు. దీనికితోడు- చంద్రబాబు నాయుడు తాజాగా నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో కూడా ఇదే అనుమానాలు వ్యక్తమయ్యాయి. మరి కొంతమంది పార్టీని వీడవచ్చని స్వయంగా చంద్రబాబే అభిప్రాయపడటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఆయా అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తెలుగుదేశం పార్టీ క్యాంపు రాజకీయాలకు తెర తీసినట్లు చెబుతున్నారు. దీని బాధ్యతను ఉత్తరాంధ్ర నాయకులకు అప్పగించారట.
అశోక్ పైనా కన్ను
ఉత్తరాంధ్రపై గట్టి పట్టు ఉన్న అశోక గజపతి రాజుపైనా టీడీపీ అగ్ర నాయకులు ఓ కన్నేసి ఉంచారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ ను పార్టీలోకి తీసుకోవడాన్ని ముందునుంచీ వ్యతిరేకిస్తున్నారు అశోక గజపతి రాజు. ఒకే జిల్లాకు చెందిన నాయకులు కావడం, వేర్వేరు పార్టీలకు ప్రాతినిథ్యం వహిస్తుండటంతో ఇన్నాళ్లూ వారి మధ్య విభేదాలు ఉన్నాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి ఒక్కసారిగా, తన రాజకీయ ప్రత్యర్థితో చేతులు కలపడానికి అశోక గజపతి రాజు సుముఖంగా లేరని చెబుతున్నారు. తన శతృవును కలుపుకొని పోవడానికి అశోక గజపతి రాజు ఏ ఛోటా మోటా నాయకుడు కూడా కాదని అంటున్నారు ఆయన అనుచరులు, సన్నిహితులు. ఇప్పటికిప్పుడు అశోక గజపతిరాజు పార్టీని వీడిపోనప్పటికీ.. క్రియాశీలకంగా దూరంగా ఉండొచ్చని చెబుతున్నారు.